నిర్మాణ రంగాన్ని ఆదుకోండి
ABN , First Publish Date - 2020-07-28T10:04:56+05:30 IST
కరోనా సమయంలో అన్ని రంగాలను ఆదుకున్నట్టే నిర్మాణ రంగాన్ని కూడా ఆదుకోవాలని క్రెడాయ్ విశాఖ చాప్టర్ చైర్మన్ పి.కోటేశ్వరరావు కోరారు.
![నిర్మాణ రంగాన్ని ఆదుకోండి](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
ప్రభుత్వానికి క్రెడాయ్ విజ్ఞప్తి
విశాఖపట్నం, జూలై 27(ఆంధ్రజ్యోతి): కరోనా సమయంలో అన్ని రంగాలను ఆదుకున్నట్టే నిర్మాణ రంగాన్ని కూడా ఆదుకోవాలని క్రెడాయ్ విశాఖ చాప్టర్ చైర్మన్ పి.కోటేశ్వరరావు కోరారు. ఇక్కడ సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇసుక విధానంలో లోపాల వల్ల బిల్డర్లు అందరికీ ఇసుక లభించడం లేదన్నారు. వెబ్ పోర్టల్లో దరఖాస్తు చేస్తే ఐదు శాతం మందికే సుదీర్ఘ ప్రాసెస్ తరువాత వస్తున్నదన్నారు. టన్ను ఇసుక ప్రభుత్వ ధర రూ.375 కాగా తాము బ్లాక్ మార్కెట్లో రూ.1,600 నుంచి రూ.2 వేల వరకు కొంటున్నామన్నారు. మార్కెట్ విలువలు పెంచితే రియల్ ఎస్టేట్ రంగం మరింత నష్టపోతుందని ఆందోళన వ్యక్తంచేశారు.
రిజిస్ట్రేషన్ చార్జీలు 2 శాతానికి తగ్గించి ఆదుకోవాలని కోరారు. క్రెడాయ్ ఉపాధ్యక్షులు అశోక్కుమార్ మాట్లాడుతూ, కరోనా రాక ముందు సిమెంట్ బస్తా రూ.220కి లభించేదని, ఇపుడు రూ.350 నుంచి రూ.400 వరకు అమ్ముతున్నారన్నారు. గతం ధరలకే ఇప్పుడూ అందివ్వాలని డిమాండ్ చేశారు. కోశాధికారి గోవిందరావు మాట్లాడుతూ రెరా చట్టంలో నిబంధనలు సవరించి ఎక్కువ మందికి ప్రయోజనం కల్పించాలన్నారు.