కరోనా వైరస్ నివారణ చర్యల్లో ప్రభుత్వం విఫలం : అయ్యన్న
ABN , First Publish Date - 2020-04-05T09:39:58+05:30 IST
కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యల్లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆరోపించారు.
నర్సీపట్నం టౌన్, ఏప్రిల్ 4 : కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యల్లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. శనివారం ఇక్కడ విలేఖర్లతో మాట్లాడుతూ జిల్లాలో ఉన్న ఫార్మా కంపెనీల సహాయ సహకారంతో అన్ని ఆస్పత్రిల్లో వెంటిలేటర్ల వ్యవస్థలు ఏర్పాటు చేయాలన్నారు. వలంటీర్లతో నిత్యావసర సరుకులు ఎందుకు పంపిణీ చేయించడం లేదని ప్రశ్నించారు. రైతులను, ఆక్వా రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఖర్చు చేసింది, కేంద్రం ఎంత ఇచ్చింది, విరాళాలు రూపంలో ఎంత వచ్చిందో శ్వేత పత్రం విడుదల చేయాలన్నారు. నర్సీపట్నం మరిడితల్లి పండుగను కేవలం పసుపు కుంకుమలు, ధూపదీప నైవేద్యాలతో ముగించనున్నామని చెప్పారు. 7వ తేదీ మంగళవారం సాయంత్రం 6.30 నుంచి 7.30 గంటల వరకూ కేబుల్ టీవీలో లైవ్ టెలికాస్ట్ కానుందన్నారు. ప్రస్తుత ఆంక్షల నేపథ్యంలో భక్తులు టీవీలో అమ్మవారిని దర్శించుకోవాలని, గుడికి ఎవ్వరూ రావద్దని విజ్ఞప్తి చేశారు.