జోన్-1లో కమిషనర్ సృజన విస్తృత పర్యటన
ABN , First Publish Date - 2020-11-26T05:05:56+05:30 IST
జీవీఎంసీ జోన్-1 పరిధిలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలు వెంటనే పరిష్కరించాలని కమిషనర్ డాక్టర్ జి.సృజన అధికారులను ఆదేశించారు.
కొమ్మాది, నవంబరు 25: జీవీఎంసీ జోన్-1 పరిధిలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలు వెంటనే పరిష్కరించాలని కమిషనర్ డాక్టర్ జి.సృజన అధికారులను ఆదేశించారు. బుధవారం ఆమె జోన్-1లోని పలు ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. ఆరిలోవలోని నైట్ షెల్టర్ను పరిశీలించి.. జీ+1 తరహాలో అభివృద్ధి చేయాలని, మహిళలకు ప్రత్యేక గది ఏర్పాటు చేసి మౌలిన వసతులు కల్పించాలని సూచించారు. అనంతరం కార్షెడ్ జంక్షన్ నుంచి మారికవలస వరకు హైవేపై గ్రిల్స్ను ఏర్పాటు చేయాలని, రానున్న రోజుల్లో మెట్రో పిల్లర్స్ వస్తే ఈ గ్రిల్స్ను తొలగించి వేరే ప్రాంతాల్లో ఉపయోగించుకునేలా ఏర్పాటు చేయాలన్నారు. మధురవాడ వాంబే కాలనీలోని 92వ బ్లాక్లో ఉన్న యూజీడీ సమస్య పరిష్కారమైందని, అయితే తాజాగా 26వ బ్లాక్లో సమస్య నెలకొందని అధికారులు కమిషనర్కు వివరించారు. అనంతరం కాలనీవాసులతో ఆమె మాట్లాడగా.. కాలనీలో పందుల సంచారం ఎక్కువగా ఉందనడంతో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత సృజన బింద్రానగర్లోని 60 అడుగుల రహదారి, రుషికొండ నుంచి ఐటీ సెజ్ వరకు గల రోడ్డు వెడల్పు పనులను పరిశీలించారు. ఎండాడ నుంచి గీతంవర్సిటీ వరకు గల రహదారిని, ఎండాడ రిజర్వాయర్ను తిలకించారు. ఆమె వెంట జోన్-1 కమిషనర్ బి.రాము, డీసీపీ రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.