వచ్చే నెల 25న ఇళ్ల పట్టాల పంపిణీ

ABN , First Publish Date - 2020-11-21T05:52:50+05:30 IST

జిల్లాలో అర్హులైన పేదలందరికీ డిసెంబరు 25న డి.ఫారం పట్టాలు పంపిణీ చేస్తామని కలెక్టర్‌ వి.వినయ్‌చంద్‌ తెలిపారు.

వచ్చే నెల 25న ఇళ్ల పట్టాల పంపిణీ
కలెక్టర్‌

కలెక్టర్‌ వినయ్‌చంద్‌

విశాఖపట్నం, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): జిల్లాలో అర్హులైన పేదలందరికీ డిసెంబరు 25న డి.ఫారం పట్టాలు పంపిణీ చేస్తామని కలెక్టర్‌ వి.వినయ్‌చంద్‌ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిసెంబరు ఒకటిలోగా లేఅవుట్లు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఇళ్ల పట్టాల పంపిణీకి సంబంధించి రిజిస్టర్లు ఆర్డీవో, తహసీల్దారు కార్యాలయాల్లో ఉండాలన్నారు. తహసీల్దారు కార్యాలయాల్లో రికార్డులు సిద్ధంపై ఆర్డీవోలు తనిఖీలు చేయాలన్నారు. కోర్టులో స్టే ఉన్న చోట్ల ప్రత్యామ్నాయ స్థలాలు చూసి లేఅవుట్లు అభివృద్ధి చేయాలన్నారు. భూసేకరణ బిల్లులు ఉంటే వెంటనే అప్‌లోడ్‌ చేయాలని ఆదేశించారు. లేవుట్‌లలో లబ్ధిదారులకు కేటాయించిన స్థలం స్పష్టంగా ఉండాలని, ఇంకా రోడ్లకు మార్కింగ్‌ పూర్తి చేయాలన్నారు. లబ్ధిదారుల జాబితాలు సిద్ధం చేసుకోవాలన్నారు. జిల్లాలో అన్ని లేఅవుట్లు ఒకే విధంగా ఉండాలని కలెక్టర్‌ స్పష్టంచేశారు.  ప్రతి మండలంలో గ్రామాలవారీగా లబ్ధిదారుల జాబితా కలెక్టరేట్‌కు పంపాలని,  ఈ జాబితాలు గ్రామ/వార్డు సచివాలయాల్లో ఉంచాలన్నారు. కొత్తగా వచ్చిన దరఖాస్తులను మూడు నెలల్లో పరిశీలించి అర్హులైన వారిని జాబితాల్లో చేర్చాలని సూచించారు. జీవీఎంసీ పరిధిలో పట్టాలకు సంబంధించి ఎప్పటికప్పుడు తహసీల్దార్లతో మాట్లాడాలని అన్నారు. సమావేశంలో జేసీ ఎం. వేణుగోపాలరెడ్డి, జీవీఎంసీ కమిషనర్‌ జి.సృజన, నర్సీపట్నం సబ్‌కలెక్టర్‌ ఎన్‌.మౌర్య, డీఆర్వో ఎ.ప్రసాద్‌, ఆర్డీవోలు కె.పెంచల కిశోర్‌, సీతారామారావు, శివజ్యోతి, డీఆర్‌డీఎ, డ్వామా పీడీలు విశ్వేశ్వరరావు, సందీప్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-11-21T05:52:50+05:30 IST