జీవో నంబర్ 21 తక్షణం ఉపసంహరించాలి
ABN , First Publish Date - 2020-11-07T06:18:07+05:30 IST
వాహన చోదకులకు పెనుభారంగా పరిణమించనున్న జీవో నంబర్ 21ను రాష్ట్ర ప్రభుత్వం తక్షణం ఉపసంహరించాలని సీపీఎం నాయకుడు, సీఐటీయూ నగర అధ్యక్షుడు ఆర్.కె.ఎస్.వి.కుమార్ డిమాండ్ చేశారు.
![జీవో నంబర్ 21 తక్షణం ఉపసంహరించాలి](https://media.andhrajyothy.com/appimg/galleries/2020110712444870/11072020004522n24.jpg)
సీఐటీయూ నాయకుడు కుమార్ డిమాండ్
కలెక్టరేట్ ఎదుట ఆటో కార్మికుల భారీ ఆందోళన
మహారాణిపేట, నవంబరు 6: వాహన చోదకులకు పెనుభారంగా పరిణమించనున్న జీవో నంబర్ 21ను రాష్ట్ర ప్రభుత్వం తక్షణం ఉపసంహరించాలని సీపీఎం నాయకుడు, సీఐటీయూ నగర అధ్యక్షుడు ఆర్.కె.ఎస్.వి.కుమార్ డిమాండ్ చేశారు. విశాఖ ఆటో రిక్షా కార్మిక సంఘం, విశాఖ మోటారు ట్రాన్స్పోర్టు వర్కర్స్ యూనియన్, విశాఖ క్యాబ్ డ్రైవర్స్ యూనియన్ తదితర రవాణా కార్మిక సంఘాలు సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట శుక్రవారం ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా కుమార్ మాట్లాడుతూ వాహనాల రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్, వాహనాల బదిలీ ఫీజులు భారీగా పెంచి భారం మోపడం దారుణమన్నారు. కరోనా కష్టకాలంలో అద్దె వాహన యజమానులు, కార్మికులు పూర్తిగా చితికిపోయారని, ఈ పరిస్థితుల్లో ఇటువంటి నిర్ణయం సముచితం కాదన్నారు.
కరోనా సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కార్మికులకు రూ.10 వేలు ఇచ్చి ఆదుకుందన్న సంతోషం ఈ జీవో విడుదలతో ఆవిరయ్యిందని విమర్శించారు. కార్మికుల ఉపాధిని దెబ్బతీసి వారికి ఉరితాడులా మారే ఇటువంటి నిబంధనలను తక్షణం ఉపసంహరించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ కార్యదర్శి అప్పలరాజు, సీఐటీయూ నగర కార్యదర్శి బి.జగన్తోపాటు పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.