లాక్డౌన్కు రాంరాం
ABN , First Publish Date - 2020-04-06T10:10:59+05:30 IST
చికెన్, మటన్, చేపల దుకాణాలకు ఆదివారం నగరవాసులు క్యూ కట్టారు.
చికెన్, మటన్ కొనుగోలుకు క్యూ కట్టిన జనం
చేపల దుకాణాల వద్దా రద్దీ
తెల్లవారుజాము నుంచే షాపుల వద్ద బారులు తీరిన వైనం
ఇదే అదనుగా ధరలు పెంచేసిన వ్యాపారులు
విశాఖపట్నం, ఏప్రిల్ 5 (ఆంధ్రజ్యోతి): చికెన్, మటన్, చేపల దుకాణాలకు ఆదివారం నగరవాసులు క్యూ కట్టారు. ఉదయం ఐదు గంటలకే కొన్ని ప్రాంతాల్లో దుకాణాలు తెరచుకోగా అప్పటికే కొనుగోలుదారులు బారులు తీరారు. లాక్డౌన్ ప్రభావంతో ఎక్కడా జనం గుమిగూడకూడదని, భౌతిక దూరం పాటించాలన్న ప్రభుత్వ ఆదేశాలను ఎవరూ పట్టించుకున్నట్టు కనిపించలేదు. నగరంలో ఏమూల చూసినా చికెన్, మటన్, చేపల దుకాణాల వద్ద భారీ క్యూలు కనిపించాయి. విశాలాక్షినగర్, అప్పుఘర్, సీతమ్మధార, నెహ్రూబజార్, గోపాలపట్నం, వన్టౌన్, కంచరపాలెం, మధురవాడ, పెందుర్తి, గాజువాక తదితర ప్రాంతాల్లో ఉదయం11 గంటల వరకు దుకాణాలు కిటకిటలాడాయి.
చేపల అమ్మకాలకు కీలకమైన ఫిషింగ్హార్బర్ మూసివేయడంతో చేపల కోసం నగరంలో చిన్నపాటి బజార్లు, రోడ్లకు ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో చెరువు చేపలు, బోట్లపై వేటాడి తెచ్చిన చేపలను విక్రయించారు. ఇరుకుసందులో ఉండే నెహ్రూబజార్ కొనుగోలుదారులతో కిక్కిరిసిపోయింది. చేపలు దొరికితే చాలనే భావనే తప్ప ఎవరిలోనూ భౌతికదూరం పాటించాలనే స్పృహ కనిపించలేదు. సాధారణంగా కిలో రూ.130 నుంచి రూ.140లకు లభించే చెరువు చేపలు... ఆదివారం రూ.200కు విక్రయించారు. చికెన్ దుకాణాల వద్ద చాలాసేపు క్యూలో నిలబడి మరీ కొనుగోలు చేశారు. ఉదయం పది గంటల సమయానికే కొన్ని ప్రాంతాల్లో చికెన్ స్టాకు అయిపోయింది. క్యూలో ఉన్నవారికి లభించలేదు.
డిమాండ్ పెరగడంతో కిలో రూ.140 నుంచి రూ.150 వరకు విక్రయాలు చేపట్టారు. కంపెనీలు ప్రకటించిన ధరకు మించి కొన్నిచోట్ల విక్రయాలు జరిగాయి. కాగా మహారాణిపేట ప్రాంతంలో కంపెనీలు నిర్ణయించిన ధరకు మించి విక్రయించిన వ్యాపారులను పోలీసులు అడ్డుకున్నారు. ఆదివారం నగరంలో నాలుగు లక్షల కిలోల చికెన్ అమ్మకాలు సాగాయని బ్యాగ్ అధ్యక్షుడు టి.ఆదినారాయణ తెలిపారు. గ్రామీణ ప్రాంతంలో లక్షన్నర కిలోల చికెన్ విక్రయాలు జరిగాయన్నారు.