కళాశాలలో క్రిస్మస్‌ వేడుకల నిర్వహణపై ఆగ్రహం

ABN , First Publish Date - 2020-12-11T04:07:45+05:30 IST

పెందుర్తి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో గురువారం దీనుల క్రిస్మస్‌ వేడుక కార్యక్రమం నిర్వహించడం వివాదాస్పదమైంది. కళాశాల ప్రాంగణంలో క్రిస్మస్‌ వేడుకలు నిర్వహించడమేమిటని బీజేపీ, విశ్వ హిందూ పరిషత్‌, హిందూ ధార్మిక సంఘాల ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

కళాశాలలో క్రిస్మస్‌ వేడుకల నిర్వహణపై ఆగ్రహం
కళాశాలలో క్రిస్మస్‌ వేడుకలు నిర్వహించడమేమిటని ప్రశ్నిస్తున్న గొర్లె రామునాయుడు

అభ్యంతరం వ్యక్తం చేసిన బీజేపీ, విశ్వ హిందూ పరిషత్‌ ప్రతినిధులు


పెందుర్తి, డిసెంబరు 10: పెందుర్తి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో గురువారం దీనుల క్రిస్మస్‌ వేడుక కార్యక్రమం నిర్వహించడం వివాదాస్పదమైంది. కళాశాల ప్రాంగణంలో క్రిస్మస్‌ వేడుకలు నిర్వహించడమేమిటని బీజేపీ, విశ్వ హిందూ పరిషత్‌, హిందూ ధార్మిక సంఘాల ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కళాశాల సమీపంలో ఉన్న హైస్కూల్‌లో టెన్త్‌ విద్యార్థులకు తరగతులు జరుగుతుండగా లౌడ్‌ స్పీకర్లతో మత ప్రార్థనలు చేశారని వారు ఆరోపించారు. కళాశాలలో మదర్‌ థెరిస్సా ఎవర్‌గ్రీన్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో క్రిస్మస్‌ వేడుకలు నిర్వహిస్తున్నారని తెలిసి బీజేపీ 96వ వార్డు అధ్యక్షుడు గొర్లె రామునాయుడు ఆధ్వర్యంలో విశ్వహిందూ పరిషత్‌ నేత పూడిపెద్ది శర్మ, హిందూ ధార్మిక సంఘాల ప్రతినిధి పార్వతి, బీజేఎంవైఎం అధ్యక్షుడు ఫణీంద్ర అక్కడికి వచ్చారు. వైస్‌ ప్రిన్సిపాల్‌ను కలిసి అనుమతి ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. సేవా కార్యక్రమం అని చెప్పడంతో అనుమతి ఇచ్చామని ఆయన తెలిపారు. అయితే కళాశాల ప్రాంగణంలో వైసీపీ నాయకుల ఫ్లెక్సీలు ఎందుకు ఏర్పాటు చేశారని నిలదీయడంతో ఆయన సమాధానం చెప్పలేదు. వీరంతా కార్యక్రమ వేదిక వద్దకు వెళ్లారు. అక్కడ వైసీపీ విశాఖ రూరల్‌ జిల్లా అధ్యక్షుడు శరగడం చినఅప్పలనాయుడు ఉండడంతో అధికార పార్టీ నాయకులు ప్రోద్బలంతోనే ఇది జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా పేదలు, సాధువులకు వస్త్రాలు, దుప్పట్లు పంపిణీ చేస్తున్నామని నిర్వాహకులు వివరించారు. అయితే ఈ కార్యక్రమానికి సాధువులను ఆహ్వానించకుండా ఉండాల్సిందని వీహెచ్‌పీ నేతలు అభిప్రాయపడ్డారు.

Updated Date - 2020-12-11T04:07:45+05:30 IST