ఆసెట్, ఆఈట్ ఫలితాలు విడుదల
ABN , First Publish Date - 2020-10-20T09:13:08+05:30 IST
ఆంధ్ర విశ్వవిద్యాలయం, అనుబంధ కళాశాలల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఆసెట్,
విశాఖపట్నం, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): ఆంధ్ర విశ్వవిద్యాలయం, అనుబంధ కళాశాలల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఆసెట్, క్యాంపస్లో సమీకృత ఇంజనీరింగ్ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించిన ఆఈట్ ఫలితాలను సోమవారం ఇన్చార్జి ఉపకులపతి ప్రొఫెసర్ పీవీజీడీ ప్రసాదరెడ్డి విడుదల చేశారు. కరోనా నేపథ్యంలో వాయిదా పడుతూ వచ్చిన ఈ పరీక్షలను ఈ నెల 13, 14, 15 తేదీల్లో నిర్వహించారు. ఆసెట్కు 17,568 మంది దరఖాస్తు చేసుకోగా, 14,732 మంది హాజరయ్యారు. ఆఈట్కు 1,909 మంది దరఖాస్తు చేయగా, 1259 మంది హాజరయ్యారు. పరీక్షా ఫలితాలను విడుదల చేసిన వీసీ పీవీజీడీ ప్రసాదరెడ్డి మాట్లాడుతూ పరీక్షలు జరిగిన మూడు రోజుల్లోనే ఫలితాలు విడుదల చేయడం గొప్ప విషయమన్నారు.
టాపర్స్ వీళ్లే..:
ఆసెట్...లైఫ్ సైన్సెస్ విభాగంలో 61 మార్కులతో ముదిండి శ్రీపూజ, ఫిజికల్ సైన్సెస్లో 78 మార్కులతో తోలేటి జ్యోతి, మ్యాథమెటికల్ సైన్సెస్లో 81 మార్కులతో లక్కోజు హేమంత్కుమార్, కెమికల్ సైన్సెస్లో 93 మార్కులతో కోనాల ఆర్షిత భవ్య, జియోలజీలో 92 మార్కులతో కళ్లేపల్లి పావని దుర్గా, స్టాటిస్టిక్స్లో 89 మార్కులతో గంటా మౌనిక, హ్యూమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్లో 77 మార్కులతో కొల్లి జాన్ మిచెల్, ఇంగ్లీష్లో 87 మార్కులతో మాడుగుల సుదీష్ణ, తెలుగులో 92 మార్కులతో గురుగుబిల్లి ధర్మతేజ, ఎంకామ్లో 65 మార్కులతో మిర్తిపాటి జాన్వెస్లీ, ఎంహెచ్ఆర్ఎం విభాగంలో 79 మార్కులతో జాగారపు సుమిత్ర కృష్ణ, ఎకనామిక్స్లో 87 మార్కులతో కొబగాన ప్రదీప్కుమార్, బీఎఫ్ఏ విభాగంలో 70 మార్కులతో లంకే గీత ప్రథమ ర్యాంకులను సాధించారు.
ఆఈట్ ఫలితాల్లో 80 మార్కులతో కొల్లిపర శ్రీకృష్ణ వెంకటసుబ్బ మొదటి ర్యాంకు, 76 మార్కులతో చివుకుల శేషసాయి సాత్విక రెండో ర్యాంకు, 71 మార్కులతో బంకూరు కీర్తన మూడో ర్యాంకు, 71 మార్కులతో పద్మనాభుని రోహిణి నివేదిత నాలుగో ర్యాంకు సాధించారు.