జిల్లాలో 12 క్వారంటైన్ సెంటర్లు
ABN , First Publish Date - 2020-03-24T09:05:33+05:30 IST
రోనా ముప్పును సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ముందు జాగ్రత్తగా జిల్లాలో 12 చోట్ల క్వారంటైన్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్టు...
- 2,382 పడకలు సిద్ధం
- జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్
విశాఖపట్నం, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): కరోనా ముప్పును సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ముందు జాగ్రత్తగా జిల్లాలో 12 చోట్ల క్వారంటైన్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్టు కలెక్టర్ వి.వినయ్ చంద్ పేర్కొన్నారు. మొత్తం 2,382 పడకలను ఆయా కేంద్రాల్లో సిద్ధం చేస్తున్నట్టు వివరించారు. నిపుణుల బృందాలు నగరంలోని వివిధ ఆసుపత్రులు, కళాశాలలను పరిశీలించి కేంద్రాలను ఎంపిక చేశాయన్నారు. విశాఖ ఇనిస్టిట్యూ ట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (విమ్స్)లో 400 పడకలు, ఏయూ బాయ్స్ హాస్టల్లో 200 పడకలు, ప్రభుత్వ మెంటల్ కేర్ ఆసుపత్రిలో 90, కొమ్మాదిలోని గాయత్రీ విద్యా పరిషత్లో 90, ప్రాంతీయ కంటి ఆసుపత్రిలో 50, రుషికొండ గీతం వైద్య కళాశాలలో 364, గీతం ఆసుపత్రిలో 200, గీతం ఇంజనీరింగ్ కళాశాలలో 748, సంగివలస ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో 100, హనుమంతువాక డాక్టర్ ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిలో 50, రుషికొండ ఏపీ టూరిజం రిషికొండలో 50, అప్పుఘర్ వద్ద 40 పడకలతో మొత్తం 2,382 సిద్ధం చేస్తున్నట్టు కలెక్టర్ వెల్లడించారు.
రెండు వేల ఐసోలేషన్ పడకలు
కరోనా అనుమానిత లక్షణాలతో వచ్చేవారిని ఉంచేందుకు అనుగుణంగా అసోలేషన్ వార్డులను అధికారులు సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇప్పటికే 320 అసోలేషన్ పడకలు సిద్ధంగా ఉన్నాయని, మరికొన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో 1,680 పడకలు సిద్ధం చేయాల్సిందిగా ఆదేశించినట్టు కలెక్టర్ తెలిపారు. కొద్దిరోజుల్లోనే వీటిని అందుబాటులోకి తీసుకురానున్నారు.