వైఎస్.. జగన్ సొత్తు కాదు
ABN , First Publish Date - 2020-09-03T08:34:45+05:30 IST
‘దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఒక మహానేత మా మనవడికి ఆయన పేరే పెట్టాం‘ అని వైసీపీ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు...

- వైసీపీ ఎంపీ రఘురామరాజు స్పష్టీకరణ
న్యూఢిల్లీ (ఆంధ్రజ్యోతి): ‘దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఒక మహానేత. ప్రజానాయకుడు. ఆయన ఏ ఒక్కరి సొత్తూ కాదు. ఆయన కొడుకు సొత్తూ కాదు. ఆయన ప్రజల సొత్తు. ఆయన తనను నమ్ముకునే వారిని ప్రేమిస్తారు. గౌరవిస్తారు. సహాయపడతారు. తన అభిమానులకు అన్యాయం జరగనివ్వరు. అందుకే మా మనవడికి ఆయన పేరే పెట్టాం‘ అని వైసీపీ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించారు. వైఎస్ వర్ధంతి సందర్భంగా బుధవారమిక్కడి తన నివాసంలో రాజశేఖరరెడ్డి నిలువెత్తు చిత్రపటానికి పుష్పాభిషేకం చేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. వైఎస్ అంటే తనకెంతో అభిమానమని చెప్పారు.
చంద్రబాబుపై వైఎస్కు గౌరవం..
వైఎస్, టీడీపీ అధినేత చంద్రబాబు స్నేహబంధంపై రఘురామరాజు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుపై ఆయనకు ఎంతో గౌరవం ఉండేదన్నారు. చంద్రబాబును కించపరిచేలా ఓ పత్రికలో కార్టూన్ ప్రచురితమైతే.. దానిని తాను వైఎస్కు చూపించానని.. దానిపై ఆయన ఒక్కసారిగా సీరియస్ అయ్యారని.. ఆ కార్టూన్ ప్రతిని విసిరిగొట్టారని తెలిపారు.