గొప్ప నాయకుడిని కోల్పోయాం..
ABN , First Publish Date - 2020-09-01T09:03:17+05:30 IST
మాజీ రాష్ట్రమతి ప్రణబ్ ముఖర్జీ మృతి దేశానికి తీరని లోటని, దేశం గొప్ప నాయకుడిని కోల్పోయిందని కేంద్ర మాజీ మంత్రి, వైసీపీ జిల్లా

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతికి పలువురి సంతాపం
టెక్కలి/ గుజరాతీపేట/ ఆమదాలవలస, ఆగస్టు 31 : మాజీ రాష్ట్రమతి ప్రణబ్ ముఖర్జీ మృతి దేశానికి తీరని లోటని, దేశం గొప్ప నాయకుడిని కోల్పోయిందని కేంద్ర మాజీ మంత్రి, వైసీపీ జిల్లా అధ్యక్షురాలు కిల్లి కృపారాణి అన్నారు. సోమవారం రాత్రి తన నివాసంలో విలేఖరులతో మాట్లాడుతూ.. తాను కేంద్రమంత్రిగా ఉన్న సమ యంలో పార్లమెంట్లో కిడ్నీ సమస్యలను ప్రస్తావించినప్పుడు తనను ప్రశంసించారని, అలాగే పోస్టల్ స్టాంపుల ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టారని జ్ఞాపకం చేసుకున్నారు.
అనేక క్యాబినెట్, సబ్కమిటీ సమావేశాల్లో ఆయనతో కలిసి పనిచేసిన అదృష్టం తనకు లభించిందన్నారు. ఆమెతో పాటు డాక్టర్ కిల్లి రామ్మోహనరావు తదితరులు ఉన్నారు. దేశ ప్రగతికి తుది శ్వాస విడిచేవరకూ పాటుపడిన గొప్ప నాయకుడు ప్రణబ్ ముఖర్జీ అని శ్రీకాకుళం ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు అన్నారు. ప్రణబ్ ముఖర్జీ మృతి దిగ్ర్భాంతి కలిగించిందని ఎంపీ రామ్మోహన్నాయుడు, డీసీసీ అధ్యక్షురాలు బొడ్డేపల్లి సత్యవతి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పైడి వేణుగోపాలం విచారం వ్యక్తం చేశారు.
డిప్యూటీ సీఎం సంతాపం
గుజరాతీపేట : భారతరత్న, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతికి డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు రాజధాని అమరావతి నుంచి సోమవారం సాయంత్రం ఒక ప్రకటన విడుదల చేశారు. క్లర్క్ స్థాయి నుంచి దేశ ప్రథమ పౌరుడిగా ఎదగడం ఎందరికో స్ఫూర్తి దాయకంగా నిలుస్తుందన్నారు. అజాత శత్రువుగా పేరు పొందిన చాలా కొద్ది మంది నేతల్లో ప్రణబ్ ముఖర్జీ ఒకరని కొనియాడారు. ఆయన లేని లోటు పూడ్చలేనిదన్నారు.