తితలీ పరిహారానికి పోరాటం

ABN , First Publish Date - 2020-12-15T05:30:00+05:30 IST

‘తితలీ తుఫాన్‌కు సంబంధించి రెట్టింపు పరిహారం ప్రకటించి 18 నెలలు గడుస్తున్నా.. ఇప్పటివరకూ అతీగతీ లేదు. సంక్రాంతిలోగా పరిహారం చెల్లించాలి. లేదంటే బాధితులకు అండగా ఉద్యమిస్తాం’ అని ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మంగళవారం ఇచ్ఛాపురం మండలం ఈదుపురం, కవిటి, రామయ్యపుట్టుగ గ్రామాల్లో ఎమ్మెల్యే అశోక్‌తో కలిసి ఎంపీ పర్యటించారు. కవిటిలో విశ్రాంత ఉపాధ్యాయ సంఘ భవనాన్ని వీరిద్దరూ ప్రారంభించారు. అనంతరం విలేకరులతో ఎంపీ మాట్లాడుతూ.. ప్రభుత్వ తీరుపై నిరసన తెలిపారు.

తితలీ పరిహారానికి పోరాటం
మాట్లాడుతున్న ఎంపీ రామ్మోహన్‌నాయుడు, పక్కన ఎమ్మెల్యే అశోక్‌

 సంక్రాంతిలోగా నిధులు చెల్లించాలి

ఎంపీ రామ్మోహన్‌నాయుడు

(కవిటి/ఇచ్ఛాపురం రూరల్‌, డిసెంబర్‌ 15)

‘తితలీ తుఫాన్‌కు సంబంధించి రెట్టింపు పరిహారం ప్రకటించి 18 నెలలు గడుస్తున్నా.. ఇప్పటివరకూ అతీగతీ లేదు. సంక్రాంతిలోగా పరిహారం చెల్లించాలి. లేదంటే బాధితులకు అండగా ఉద్యమిస్తాం’ అని ఎంపీ  కింజరాపు రామ్మోహన్‌నాయుడు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మంగళవారం ఇచ్ఛాపురం మండలం ఈదుపురం, కవిటి, రామయ్యపుట్టుగ గ్రామాల్లో ఎమ్మెల్యే అశోక్‌తో కలిసి ఎంపీ పర్యటించారు. కవిటిలో విశ్రాంత ఉపాధ్యాయ సంఘ భవనాన్ని వీరిద్దరూ ప్రారంభించారు. అనంతరం విలేకరులతో ఎంపీ మాట్లాడుతూ.. ప్రభుత్వ తీరుపై నిరసన తెలిపారు. ‘తితలీ బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది. ముఖ్యమంత్రి హోదాలో జగన్‌.. పలాసలో తితలీ రెట్టింపు పరిహారం చెక్కులను రెండు ఇచ్చి వెళ్లిపోయారు. ఇప్పటివరకూ బాధితులకు పరిహారం చెల్లించలేదు. సంక్రాంతిలోగా పరిహారం చెల్లించపోతే పోరాటం తప్పదు’ అని ఎంపీ స్పష్టం చేశారు. వైసీపీ నేతలు ప్రజా సమస్యలపై దృష్టి సారించడం లేదన్నారు. ఇప్పటివరకూ ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించకపోవడం శోచనీయమన్నారు. రాష్ట్రంలో 60 లక్షల రేషన్‌ కార్డులు తొలగించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆరోపించారు. సెంటు భూమి లేని వారికి  పదెకరాల భూమిని ఆన్‌లైన్‌లో చూపుతూ కార్డులు తొలగిస్తున్నారని మండిపడ్డారు. 


వైసీపీకి ఎన్నికలంటే భయం


ఎన్నికలంటే వైసీపీకి భయం పట్టుకోంది. అందుకే స్థానిక ఎన్నికలను అడ్డుకుంటోంది’ అని ఎంపీ రామ్మోహన్‌నాయుడు ఆరోపించారు. టీడీపీకి గ్రామస్థాయిలో ప్రస్తుతం మరింత బలం పెరిగిందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు ప్రజలకు ఓట్లు అడగడానికి ముఖం చెల్లక ఎన్నికలు వాయిదాలు వేస్తున్నారని విమర్శించారు.


రాష్ట్రంలో జగన్‌ ట్యాక్స్‌ అమలు


‘రాష్ట్రంలో జగన్‌ ట్యాక్స్‌ అమలవుతోంది. ఉదయం వినియోగించే టూత్‌ బ్రష్‌ నుంచి ప్రతి వస్తువు మీద టాక్స్‌ చెల్లించాల్సిన దౌర్భాగ్య స్థితి నెలకొంది’ అని ఎంపీ రామ్మోహన్‌నాయుడు ఆరోపించారు. నిత్యావసర వస్తువుల నుంచి పెట్రోల్‌, గ్యాస్‌, విద్యుత్‌పై ప్రభుత్వం పన్నులు విధించిందని, చివరకు ఆస్తి పన్ను భారం కూడా పెంచిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో రోడ్లపై తిరిగితే పన్ను వసులు చేసే పరిస్థితులు దాపురించాయన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డికి  పరిపాలనపై అవగాహన లేదన్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలపై దౌర్జన్యాలు చేయడమే ఆయన పనిగా పెట్టుకొన్నారని ఆరోపించారు. ఇదిలా ఉండగా.. ఈదుపురంలో స్వదేశీ మత్స్యకారుల శ్మశాన వాటికకు వెళ్లే రోడ్డు అభివృద్ధి చేయాలని, సామాజిక భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని గ్రామస్థులు కోరారు. ఈ కార్యక్రమంలో  జడ్పీటీసీ మాజీ సభ్యులు పి.కృష్ణారావు, బి.రమేష్‌, మాజీ ఎంపీపీలు ఢిల్లీరావు, చిత్రాడ శ్రీను, ఏఎంసీ మాజీ  చైర్మన్‌ సహదేవు, మాజీ ఉపాధ్యక్షుడు సీపాన వెంకటరమణ, డి.కామేష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-12-15T05:30:00+05:30 IST