గిరిజనులకు మంచి రోజులు
ABN , First Publish Date - 2020-10-03T10:20:10+05:30 IST
గిరిజనుల దశాబ్దాల కల వైసీపీ ప్రభుత్వంతో సాధ్యమైందని, వారికి మంచి రోజులు వస్తున్నాయని శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం, డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. శుక్రవారం సీతంపేట ఐటీడీఏ సమావేశ మందిరంలో అటవీ హక్కుల సాగు పత్రాలు, వ్యవసాయ భూముల పట్టాలను పంపిణీ చేశారు.
స్పీకర్ తమ్మినేని, డిప్యూటీ సీఎం కృష్ణదాస్
అటవీ హక్కుల సాగు పత్రాలు, భూ పట్టాల పంపిణీ
సీతంపేట, అక్టోబరు 2: గిరిజనుల దశాబ్దాల కల వైసీపీ ప్రభుత్వంతో సాధ్యమైందని, వారికి మంచి రోజులు వస్తున్నాయని శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం, డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. శుక్రవారం సీతంపేట ఐటీడీఏ సమావేశ మందిరంలో అటవీ హక్కుల సాగు పత్రాలు, వ్యవసాయ భూముల పట్టాలను పంపిణీ చేశారు. ముందుగా కార్యక్రమాన్ని సీఎం జగన్ వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా స్పీకర్, డిప్యూటీ సీఎంలు మాట్లాడుతూ 17,939 మంది గిరిజనులకు 26,931 ఎకరాలకు సాగు హక్కు పత్రాలు పంపిణీ చేసినట్టు తెలిపారు.
గిరిజనులకు భూమిపై పూర్తి హక్కు దక్కడం ఆనందంగా ఉందన్నారు. సీఎం జగన్ గిరిజన పక్షపాతి అన్నారు. ఐటీడీఏల పరిధిలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు మంజూరు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. గిరిజన గ్రామాలకు తాగునీరు, విద్య, వైద్యంతో పాటు మౌలిక వసతులు కల్పించనున్నట్టు తెలిపారు.
అనంతరం మహిళా సంఘాలకు మంజూరైన రూ.3 కోట్ల నిధులకు సంబంధించి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన స్టాళ్లను పరిశీలించారు. కార్యక్రమంలో మంత్రి సీదిరి అప్పలరాజు, కలెక్టర్ నివాస్, ఐటీడీఏ పీవో శ్రీధర్, ఎమ్మెల్యేలు రెడ్డి శాంతి, విశ్వసరాయి కశావతి, కంబాల జోగులు, డీసీసీబీ అధ్యక్షుడు పాలవలస విక్రాంత్, డీఎఫ్వో సందీప్ కృపాకర్, సబ్ కలెక్టర్ సూరజ్ ధనంజయ్ తదితరులు పాల్గొన్నారు.