బోసొపోయిన ఆర్టీసీ బస్స్టేషన్
ABN , First Publish Date - 2020-03-23T09:33:04+05:30 IST
ప్రతినిత్యం వందలాది బస్సుల రాకపోకలతో కళకళలాడే శ్రీకాకుళం నగరంలోని ఆర్టీసీ బస్స్టేషన్
గుజరాతీపేట, మార్చి 22 : ప్రతినిత్యం వందలాది బస్సుల రాకపోకలతో కళకళలాడే శ్రీకాకుళం నగరంలోని ఆర్టీసీ బస్స్టేషన్ జనతా కర్ఫ్యూ కారణంగా ఆదివారం వెలవెలబోయింది. జిల్లాలోని శ్రీకాకుళం 1, 2, పలాస, టెక్కలి, పాలకొండ డిపోలకు చెందిన సుమారు 428 బస్సులు, విశాఖకు చెందిన వందలాది బస్సులు ఇక్కడి బస్స్టేషన్కు ప్రతినిత్యం రాకపోకలతో సందడిగా ఉండేది. కర్ప్యూ నేపథ్యంలో బస్స్టేషన్, డిపోల్లో బస్సులు నిలిచాయి.
అత్యవసర సేవలకే పరిమితం
స్థానిక ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్)లో ఆదివారం అత్యవసర కేసులు మినహా ఓపీ నమోదు అవ్వలేదు. క్యాజువాలిటీ విభాగంలో రోజూ వందలాది కేసులు చేరేవి. అయితే.. ఆదివారం 11 కేసులు వచ్చాయి. ఇప్పటివరకూ ఆసుపత్రిలో ఉన్న రోగులకు వైద్యసేవలను అందించారు.
బోసిపోయిన క్రీడా మైదానం..
విద్యార్థులు, క్రీడాకారులతో సందడిగా ఉండే ప్రభుత్వ పురుషుల కళాశాల మైదానం ఆదివారం బోసిపోయింది. నగరంలోని ప్రధాన ప్రైవేట్ ఆసుపత్రులకు కూడా యాజమాన్యాలు తాళాలు వేసేశారు. పార్కులను సందర్శించే వారు కరువయ్యారు.