వలంటీర్లపై బిగుస్తున్న ఉచ్చు

ABN , First Publish Date - 2020-04-12T11:54:38+05:30 IST

మెళియాపుట్టి మండలం జలగలింగుపురంలో..

వలంటీర్లపై బిగుస్తున్న ఉచ్చు

జలగలింగుపురంలో అక్రమాలపై నివేదిక

‘ఆంధ్రజ్యోతి’ కథనానికి స్పందన


మెళియాపుట్టి(శ్రీకాకుళం): మెళియాపుట్టి మండలం జలగలింగుపురంలో ‘కరోనా సాయం’ పంపిణీలో అవకతవకలకు పాల్పడిన వలంటీర్లపై ఉచ్చు బిగించేందుకు రంగం సిద్ధమవుతోంది. కరోనా కారణంగా ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ప్రజలను ఆదుకోవాలనే సదుద్దేశంతో ప్రభుత్వం మంజూరు చేసిన ‘వెయ్యి’ రూపాయల సాయంలో కొంతమంది వలంటీర్లు చేతివాటం ప్రదర్శించారు. గ్రామాల్లో స్థానికంగా నివాసం లేని వారి పేరిట మంజూరైన నిధులను నొక్కేశారు.


దీనిపై ‘‘అక్రమాలకు ‘వెయ్యి’దారులు’’! పేరిట శనివారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ఈ అక్రమాలపై నివేదికలు పంపాలని జేసీ శ్రీనివాసులు రెవెన్యూ అధికారులకు ఆదేశించినట్టు తెలిసింది. ఈ మేరకు రెవెన్యూ అధికారులు ఇప్పటికే నివేదిక సిద్ధం చేశారు. ఈ క్రమంలో వలస వెళ్లిన వారిలో కొంతమంది బంధువులను వలంటీర్లు శనివారం రెవెన్యూ కార్యాలయానికి తీసుకెళ్లారు. వారికే ఈ సాయం అందజేసినట్టు వివరించే ప్రయత్నం చేశారు. కానీ.. నిబంధనలకు విరుద్ధంగా ‘కరోనా సాయం’ పంపిణీ జరిగిందని... ఇదే విషయాన్ని పై అధికారులకు నివేదిక అందజేస్తానని తహసీల్దార్‌ దామోధరరావు చెప్పడంతో వారంతా వెనుదిరిగారు. 


మరోవైపు గ్రామంలో లేనివారికి ‘కరోనా సాయం’ అందజేసినట్టు లెక్కలు చూపినవారు.. స్వచ్ఛందంగా ఆ డబ్బులు తీసుకువచ్చి రికవరీ కింద జమ చేయాలని ఎంపీడీవో చంద్రకుమారి, ఈవో పీఆర్డీ రమేష్‌, ఏవో అనురాధలు వలంటీర్లకు సూచించారు. కార్యదర్శి అప్పారావుకు ఈ డబ్బులు అందజేయాలని తెలిపారు. జలగలింగుపురం వలంటీర్లపై అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది వేచిచూడాలి.  

Updated Date - 2020-04-12T11:54:38+05:30 IST