‘కార్పొరేషన్’ అక్రమాలపై విచారణ
ABN , First Publish Date - 2020-11-14T04:49:41+05:30 IST
శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలో అక్రమ కట్టడాలు భారీగా వెలిశాయని గతంలో ప్రభుత్వానికి ఫిర్యాదు అందింది. అప్పట్లో పనిచేసిన టీపీబీవోలు వై.శ్రీలక్ష్మి, హెచ్వీ.సత్యనారాయణ, టీపీవో ఎ.సత్యమూర్తి, ఇన్ఛార్జి టీపీవోలు వై.ఉమామహేశ్వరరావు, బి.సురేష్కుమార్లు సక్రమంగా విధులు నిర్వహించకపోవడమే ఇందుకు కారణమని ఫిర్యాదుదారులు పేర్కొన్నారు. ప్రభుత్వం ఈ ఫిర్యాదుపై విచారణకు ఆదేశించింది.
శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి, నవంబరు 13 : శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలో అక్రమ కట్టడాలు భారీగా వెలిశాయని గతంలో ప్రభుత్వానికి ఫిర్యాదు అందింది. అప్పట్లో పనిచేసిన టీపీబీవోలు వై.శ్రీలక్ష్మి, హెచ్వీ.సత్యనారాయణ, టీపీవో ఎ.సత్యమూర్తి, ఇన్ఛార్జి టీపీవోలు వై.ఉమామహేశ్వరరావు, బి.సురేష్కుమార్లు సక్రమంగా విధులు నిర్వహించకపోవడమే ఇందుకు కారణమని ఫిర్యాదుదారులు పేర్కొన్నారు. ప్రభుత్వం ఈ ఫిర్యాదుపై విచారణకు ఆదేశించింది. గ్రేటర్ విశాఖ మునిసిపల్ కార్పొరేషన్ సిటీ ప్లానర్ ఎ.ప్రభాకరరావును తొలుత విచారణాధికారిగా నియమించింది. ఆయన విచారణ చేపట్టకపోవడంతో కాకినాడ గుడా చీఫ్ ప్లానింగ్ అధికారి వి.రామ్కుమార్కు కొద్దినెలల కిందట ఈ బాధ్యత అప్పగించింది. కొవిడ్ కారణంగా ఆయన కూడా తప్పుకున్నారు. దీంతో తాజాగా విచారణ బాధ్యతలను జీవీఎంసీ సీసీపీ ఆర్జే విద్యుల్లతకు అప్పగించింది. ఈ మేరకు అక్రమ కట్టడాల్లో టీపీబీవో, ఇన్ఛార్జి టీపీవోలు, టీపీల పాత్రపై విచారణ చేసి నెలరోజుల్లో నివేదిక ఇవ్వాలంటూ మునిసిపల్ శాఖ ప్రభుత్వ కార్యదర్శి జె.శ్యామలరావు ఉత్తర్వులు జారీ చేశారు.
విచారణ అధికారి మార్పు...
శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలో మునిసిపల్ రోడ్లు, అభివృద్ధి పనులపై పూర్వపు కమిషనర్ గోవిందస్వామి, డీఈఈ బి.వేణుగోపాలరావు, ఏఈ సీహెచ్ నాగేశ్వరరావులపై ఆరోపణలతో ప్రభుత్వానికి గతంలో ఫిర్యాదు అందింది. దీనిపై విచారణ చేసి నివేదిక అందజేయాలని విచారణ అధికారిగా ఎన్వీవీవీఎస్వీపీ నూకేశ్వరరావును ప్రభుత్వం నియమించింది. ఆయన ఇటీవల పదవీ విరమణ చేశారు. దీంతో విచారణ బాధ్యతలను సహాయ కమిషనర్ కె.శివప్రసాద్కు అప్పగిస్తూ మున్సిపల్ శాఖ ప్రభుత్వ కార్యదర్శి జె.శ్యామలరావు ఉత్తర్వులు జారీచేశారు.