కొవిడ్ నిబంధనల నడుమ.. స్వాతంత్య్ర వేడుకలు
ABN , First Publish Date - 2020-08-16T12:07:51+05:30 IST
కొవిడ్ నిబంధనల నడుమ.. శ్రీకాకుళంలోని ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల మైదానంలో శనివారం స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు.

(కలెక్టరేట్)
కొవిడ్ నిబంధనల నడుమ.. శ్రీకాకుళంలోని ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల మైదానంలో శనివారం స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకులకు ముఖ్యఅతిథిగా జిల్లా ఇన్చార్జి మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు(నాని), మరో అతిథిగా మంత్రి సీదిరి అప్పలరాజు హాజరయ్యారు. వారిద్దరికీ కలెక్టర్ జె.నివాస్, ఎస్పీ అమిత్బర్దర్ పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు. పోలీసులు గౌరవ వందనం చేశారు. అనంతరం మంత్రి కొడాలి నాని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. విద్యార్థులు, చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శలు ఆకట్టుకున్నాయి. ప్రభుత్వ శకటాల ప్రదర్శలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ఆకట్టుకున్నాయి. స్వాతంత్య్ర సమరయోధులను వేడుకలకు ఆహ్వానించగా.. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఎవరూ హాజరు కాలేదు. కేవలం సమరయోధుడు అప్పలరామయ్య మాత్రమే హాజరయ్యారు. ఆయనను జిల్లా ఇన్చార్జి మంత్రి కొడాలి నాని సత్కరించారు. జిల్లాలో కొవిడ్ నుంచి కోలుకున్న వివిధ శాఖల ఉద్యోగులకు, వివిధ వర్గాల ప్రజలకు పురస్కారాలు అందించారు. ముందుగా కొవిడ్ నుంచి బయటపడిన వారితో మంత్రి కొడాలి నానితో పాటు నేతలు, అధికారులంతా విజయ సంకేతాన్ని చూపారు. అనంతరం జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖలో పనిచేస్తూ కరోనా బారిన పడి కోలుకున్న 49 మంది ఉద్యోగులకు పురస్కారాలు ప్రదానం చేశారు.