టెన్షన్..టెన్షన్!
ABN , First Publish Date - 2020-03-13T10:22:02+05:30 IST
ప్రాదేశిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణకు 24 గంటలే గడువు ఉంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు భారీగా
![టెన్షన్..టెన్షన్!](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
ఎంపీటీసీ, జడ్పీటీసీలకు భారీగా నామినేషన్లు
ప్రధాన పార్టీ నుంచి ఎక్కువ మంది దాఖలు
అధికార పార్టీ నుంచే అధికం
ఉపసంహరణకు సమీపిస్తున్న గడువు
అసంతృప్తి నేతలకు నామినేటెడ్ పదవుల ఎర
(శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి)
ప్రాదేశిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణకు 24 గంటలే గడువు ఉంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. ఒక్కోస్థానం నుంచి ఒకే పార్టీ నుంచి నేతలు నామినేషన్లు వేశారు. వీరంతా పార్టీ బీ ఫారాలు దక్కించుకోవడానికి పావులు కదుపుతున్నారు. సర్దుబాట్లకు ప్రయత్నిస్తున్నారు. నేతలు చర్చల్లో మునిగి తేలుతున్నారు. జిల్లాలో మొత్తం 667 ఎంపీటీసీ స్థానాలకు 3,336 నామినేషన్లు దాఖలయ్యాయి. 38 జడ్పీటీసీ స్థానాలకు 318 నామినేషన్లు దాఖలయ్యాయని అధికారులు తేల్చారు.
టెక్కలి, నందిగాం, ఇచ్ఛాపురం, ఆమదాలవలస, సోంపేట వంటి మండలాల్లో అసంతృప్తితో ఉన్న నేతలను బుజ్జగించేందుకు నేరుగా వైసీపీ అధినాయకత్వం రంగంలోకి దిగింది. పార్టీకి విధేయులుగా ఉండాలంటూ పరోక్షంగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఉపసంహరణకు గడువు పూర్తి కాగానే పార్టీల నేతలు నేరుగా బీఫారాలను అధికారులకు ఇవ్వాలని భావిస్తున్నారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు, వివిధ పదవుల్లో ఉన్నవారు, వారి కుటుంబాల సభ్యులు, బంధువులు ఎవరూ స్థానిక పోరులో ఉండరాదని... నిజమైన కార్యకర్తలకు అవకాశం ఇవ్వాలని పార్టీ నిర్ణయం తీసుకుంది.
దీంతో మంత్రి కృష్ణదాస్ కుమారుడు జలుమూరు జడ్పీటీసీ అభ్యర్థిగా నామినేషన్ వేసి, వెనక్కి తీసుకోవాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని మంత్రి కృష్ణదాస్ స్వయంగా ప్రకటించారు. మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుతం పదవుల్లో ఉన్న వారీ సతీమణులు పలువురు నామినేషన్లు దాఖలు చేయడంతో నామినేటెడ్ పదవులను ఎరగా చూపుతున్నారు.
కొందరిని బుజ్జగించి పోటీ నుంచి తప్పుకోవాలని కోరుతున్నారు. మరికొందరికి తాయిలాలు ఇచ్చి పోటీ నుంచి తప్పించేందుకు మంతనాలు సాగిస్తున్నారు. కోఆప్షన్, జీసీసీ, మార్కెట్ కమిటీల పదవులను ఇస్తామంటూ ఎరవేస్తున్నారు. అసంతృప్తి నేతల బెడద ఎక్కువగా అధికార వైసీపీ పార్టీలోనే ఉండడంతో నేతలకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. ససేమిరా అనే అభ్యర్థులపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసి, చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు.