‘పలాస’లో హై అలర్ట్‌!.. ఇటు రావద్దు.. అటు పోవద్దు!

ABN , First Publish Date - 2020-06-22T21:38:04+05:30 IST

పలాస నియోజకవర్గంలో కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు హై అలర్ట్‌ ప్రకటించారు. పలాస-కాశీబుగ్గ జంట పట్టణాల్లో కొన్ని వీధులను దిగ్బంధించారు. కంటైన్మెంట్‌ జోన్‌ల

‘పలాస’లో హై అలర్ట్‌!.. ఇటు రావద్దు.. అటు పోవద్దు!

కంటైన్మెంట్‌ జోన్లలో హెచ్చరిక బోర్డులు 


పలాస(ఆంధ్రజ్యోతి) : పలాస నియోజకవర్గంలో కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు హై అలర్ట్‌ ప్రకటించారు. పలాస-కాశీబుగ్గ జంట పట్టణాల్లో కొన్ని వీధులను దిగ్బంధించారు. కంటైన్మెంట్‌ జోన్‌ల పరిధిలో ‘ఇటు రావద్దు.. అటు పోవద్దు’ అంటూ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. కాశీబుగ్గలో ఉధృతంగా కేసులు ఉన్న ప్రాంతాన్ని అధికారులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. మొత్తం కాలనీ వాసులకు కరోనా పరీక్షలు చేస్తున్నారు.  కొందరి శ్వాబ్‌లు సేకరించి కాకినాడలోని ల్యాబ్‌కు పంపించారు. పలాసలో కూడా ఓ ఇంట్లో కరోనా కేసు నమోదైన నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని కూడా అప్రమత్తం చేశారు.


 ఆదివారం కాశీబుగ్గ సీఐ వేణుగోపాలరావు, మునిసిపల్‌ కమిషనర్‌ టి.నాగేంద్రకుమార్‌, తహసీల్దార్‌ మధుసూదనరావు జంట పట్టణాల్లో పర్యటించారు. ఈ రెండు ప్రాంతాల్లోని కంటైన్మెంట్‌ జోన్లలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. రాకపోకలు పూర్తిగా నిర్బంధించారు.  పోలీసులు ఎక్కడికక్కడ వాహనాలు తనిఖీ చేశారు. మాస్క్‌లు ధరించాలంటూ ఆటోలకు స్టిక్కర్లు అంటించారు. ఏదిఏమైనా పకడ్బందీగా లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నారు. మద్యం, ఔషధ షాపులు తప్ప మిగిలిన దుకాణాలన్నీ మూతపడ్డాయి.  

Updated Date - 2020-06-22T21:38:04+05:30 IST