సమష్టిగా సాగి.. శ్రమదానం చేసి

ABN , First Publish Date - 2020-06-22T11:26:39+05:30 IST

మూడు గ్రామాల రైతులకు ఆ చెరువే ఆధారం. సుమారు 70 ఎకరాల ఆయకట్టు ఇక్కడ ఉంది.

సమష్టిగా సాగి.. శ్రమదానం చేసి

కమళాయిపుట్టుగ ఊర చెరువు వద్ద చెక్‌డ్యాం నిర్మాణం

సొంత నిధులతో పనులు చేపడుతున్న రైతులు


ఇచ్ఛాపురం రూరల్‌, జూన్‌ 21 : మూడు గ్రామాల రైతులకు ఆ చెరువే ఆధారం. సుమారు 70 ఎకరాల ఆయకట్టు ఇక్కడ ఉంది. అయితే, తుఫాన్ల ధాటికి చెరువు చెక్‌డ్యాం కొట్టుకుపోయింది. దీంతో వేసవిలో నీరు నిల్వ ఉండకపోవడంతో భూములు బీడుగా మారాయి. రెండేళ్లుగా ఇదే పరిస్థితి. అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదు. దీంతో రైతులే ఒక్కటిగా కదిలి సొంత నిధులతో చెక్‌డ్యాం నిర్మాణంతో పాటు ఇతర మరమ్మతు పనులు చేపడుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. కమళాయిపుట్టుగలోని ఊర చెరువుపై ఆధారపడి కమళాయిపుట్టుగ, లండపుట్టుగ, బలరాంపురం గ్రామాలకు చెందిన 200 మంది రైతులు 70 ఎకరాల్లో వరి, రాగులు, నువ్వు, పెసర, మినప, తదితర పంటలు పండిస్తుంటారు. సకాలంలో వర్షాలు పడి చెరువు నిండితే వేసవిలో కూడా పంటలను సాగు చేస్తుంటారు.


అయితే, తితలీ, పైలన్‌ తుఫాన్‌లకు ఊర చెరువు చెక్‌డ్యాం కొట్టుకుపోయింది. దీంతో చెరువులో చుక్క నీరు కూడా నిల్వ ఉండడం లేదు. ఆయా గ్రామాల రైతులు పలు గ్రీవెన్స్‌ల్లో, ఇరిగేషన్‌ అధికారులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేదు. పక్కనే చెరువు ఉన్నా భూములు బీడుగా మారడాన్ని తట్టుకోలేకపోయారు. ఆయా గ్రామాల రైతులు సమాలోచన చేశారు. చెక్‌డ్యాంను మనమే నిర్మించుకుందామని నిర్ణయించుకున్నారు. దీనికోసం ఎకరాకు రూ.3 వేలు చొప్పున రైతుల నుంచి  వసూలు చేశారు.


ఈ సొమ్ముతో చెక్‌డ్యాంను నిర్మించడంతో పాటు ఇతర మరమ్మతు పనులు చేపడుతున్నారు. రైతులే విడతల వారీగా ఈ పనుల్లో పాల్గొంటున్నారు. కొత్త చెక్‌డ్యాం నిర్మాణం దాదాపు పూర్తయ్యింది. ఈ సందర్భంగా రైతులు సీరపు బైరాగి, కొయ్యి తులసయ్య, లండ వెంకటస్వామి, పైల ఎర్రయ్య, ఆబోతుల ఎర్రయ్య, తదితరులు మాట్లాడుతూ ఇప్పటికైనా ప్రభుత్వం, ఇరుగేషన్‌ అధికారులు స్పందించాలని కోరారు. 

Updated Date - 2020-06-22T11:26:39+05:30 IST