వైద్యులు స్వీయ రక్షణ పాటించాలి: కలెక్టర్
ABN , First Publish Date - 2020-06-19T11:25:25+05:30 IST
వైద్యులు స్వీయ రక్షణ పాటిస్తూ కరోనా రోగులను చికిత్స అందించాలని కలెక్టర్ నివాస్ సూచించారు. గురువారం జడ్పీ సమావేశ మందిరంలో
![వైద్యులు స్వీయ రక్షణ పాటించాలి: కలెక్టర్](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
గుజరాతీపేట, జూన్ 18: వైద్యులు స్వీయ రక్షణ పాటిస్తూ కరోనా రోగులను చికిత్స అందించాలని కలెక్టర్ నివాస్ సూచించారు. గురువారం జడ్పీ సమావేశ మందిరంలో ప్రైవేట్ ఆసుపత్రుల వైద్యులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘‘జిల్లాలో రానున్న రోజుల్లో కరోనా మరింత వ్యాప్తి చెందే అవకాశం ఉంది. కరోనా లక్షణాలతో ఎవరైనా ఆసుపత్రికి వస్తే వారి వివరాలు తక్షణమే మాకు అందజేయండి. 9440512447 నంబర్కు వాట్సాప్ లేదా ఫోన్ చేయండి. దీనివల్ల వైరస్ వ్యాప్తిని అడ్డుకోవచ్చు.
వైద్యులు పీపీఈ కిట్లను వినియోగించాలి. లేదంటే రోగితో పాటు వైద్యులు కూడా కరోనా బారిన పడతారు. జిల్లాలో ట్రూనాట్ కిట్లకు కొరత లేదు. రోజుకు సుమారు 1500 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్న ఏకైక జిల్లా శ్రీకాకుళం. వలసలు వెళ్లిన వారు తిరిగి జిల్లాకు చేరుకుంటున్నారు. వారిలో కొంతమందికి కరోనా లక్షణాలు ఉంటున్నాయి. ఈ లక్షణాలను వారు గుర్తించడం లేదు. జిల్లాలో ప్రత్యేక యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చాం. ప్రైవేటు ఆసుపత్రులకు వచ్చే రోగుల వివరాలను ఈ యాప్లో అప్లోడ్ చేయాలి. ఏమైనా సందేహాలు, సమస్యలు ఉంటే 9885696486 నంబర్కు ఫోన్ చేసి నివృత్తి చేసుకోండి. వైద్యులు ఆరోగ్య సేతు యాప్ను డౌన్ లోడ్ చేసుకోవాలి. కరోనా నివారణకు జిల్లా ప్రైవేటు ఆసుపత్రులు సహకరించాయి. ఇదే స్ఫూర్తిని ఇకముందు కూడా కొనసాగించాలి’’ అని వైద్యులను కలెక్టర్ కోరారు.