స్పౌజ్ దుర్వినియోగంలో హెచ్ఎంపై సస్పెన్షన్ వేటు
ABN , First Publish Date - 2020-12-11T05:58:03+05:30 IST
బదిలీల్లో స్పౌజ్ కేటగిరీలో దుర్వినియోగానికి పాల్పడిన వ్యవహారంలో ఓ ప్రధానోపాధ్యాయురాలిని సస్పెండ్ చేసినట్లు కడప ఆర్జేడీ వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు.
![స్పౌజ్ దుర్వినియోగంలో హెచ్ఎంపై సస్పెన్షన్ వేటు](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
చర్యలు తీసుకున్న ఆర్జేడీ వెంకటకృష్ణారెడ్డి
అనంతపురం విద్య, డిసెంబరు 10: బదిలీల్లో స్పౌజ్ కేటగిరీలో దుర్వినియోగానికి పాల్పడిన వ్యవహారంలో ఓ ప్రధానోపాధ్యాయురాలిని సస్పెండ్ చేసినట్లు కడప ఆర్జేడీ వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఈ ఏడాది బదిలీల్లో దొడ్డిదారిన స్పౌజ్ వినియోగానికి పాల్పడటంతో ఆత్మకూరు మండలం యాలేరు స్కూల్ టీచర్ రామకృష్ణను బుధవారం డీఈఓ శామ్యూల్ సస్పెండ్ చేశారు. రామకృష్ణకు సహకరించిన పెనుకొండ తోటగేరి సెంట్రల్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు కవితపై చర్యలు తీసుకోవాలంటూ ఆర్జేడీకి డీఈఓ లెటర్ పెట్టారు. ఆ మేరకు విచారణ చేసిన ఆర్జేడీ.. హెచ్ఎంను సస్పెండ్ చేసినట్లు ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు.
పారదర్శకంగా ఉపాధ్యాయ బదిలీలు
- డీఈఓ శామ్యూల్
ఉరవకొండ, డిసెంబరు10: ఉపాధ్యాయుల బదిలీలను పారదర్శకంగా చేపడుతున్నట్లు డీఈఓ శామ్యుల్ పేర్కొన్నారు. మండలంలోని చిన్నముస్టూరు ఆదర్శ పాఠశాలలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. వారంలోపు ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు. సీనియారిటీ జాబితాను విడుదల చేస్తామన్నారు. రేపట్నుంచి ఉపాధ్యాయులు ఆఫ్షన్ పెట్టుకోవచ్చన్నారు. ఇద్దరు టీచర్లను సస్పెండ్ చేశామన్నారు. 1, 2, 3 కేటగిరీల్లో 650 పోస్టులను బ్లాక్ చేశామన్నారు. 8 ఏళ్లు పూర్తయిన వారు 1,270 మంది, ఐదేళ్లు పూర్తయినవారు 25 మంది ఉన్నారన్నారు. నాడు-నేడు పనులు 90.5 శాతం, సివిల్ పనులు 85 శాతం పూర్తయ్యాయన్నారు. నెలఖారులోపు అన్నింటినీ పూర్తి చేస్తామన్నారు. పాఠశాలలకు 45 శాతం మంది విద్యార్థులు హాజరవుతున్నారన్నారు. సమావేశంలో ఎంఈఓ ఈశ్వరయ్య, పాల్గొన్నారు.