ఉపాధికి డిమాండ్‌!

ABN , First Publish Date - 2020-06-03T10:28:35+05:30 IST

ఉపాధి హామీ పథకంలో వేతనదారుల సంఖ్య పెరుగుతోంది. వలస కూలీలు స్వగ్రామాలకు చేరుతుండడమే ఇందుకు కారణం.

ఉపాధికి డిమాండ్‌!

ఉపాధి హామీ పనుల్లో పెరిగిన వేతనదారులు

గత ఏడాదితో పోలీస్తే గణనీయంగా పెరిగిన సంఖ్య

వలస కూలీలు స్వగ్రామాలకు చేరుతుండడమే కారణం

 

(పాలకొండ): ఉపాధి హామీ పథకంలో వేతనదారుల సంఖ్య పెరుగుతోంది. వలస కూలీలు స్వగ్రామాలకు చేరుతుండడమే ఇందుకు కారణం. లాక్‌డౌన్‌ ఆంక్షల సడలింపులో భాగంగా ఇతర ప్రాంతాలకు వలసపోయిన వారు వ్యయప్రయాసలకోర్చి స్వస్థలాలకు చేరుతున్నారు. స్థానికంగానే ఉండిపోవడానికి నిర్ణయించుకుంటున్నారు. వ్యవసాయ పనులతో పాటు ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నారు.


జాబ్‌కార్డుదారులంతా ఉపాధి పనుల కోసం పరుగులు తీస్తున్నారు. ఇతర ప్రాంతాలకు వలసపోయిన చాలామంది జాబ్‌కార్డులు వినియోగించకపోవడంతో వాటి గడువు ముగిసింది. వాటిని తిరిగి వినియోగంలోకి తీసుకువచ్చేందుకు  కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. అందరికీ పనులు కల్పిస్తామని అధికారులు చెబుతుండడంతో చాలామంది కొత్తగా దరఖాస్తు చేసుకుంటున్నారు. ప్రతి మండలం నుంచి 500 నుంచి 1000 వరకూ కొత్తగా దరఖాస్తులు వచ్చినట్టు అధికారులు చెబుతున్నారు. వాటిని ఆన్‌లైన్‌ చేసే పనిలో సిబ్బంది నిమగ్నమై ఉన్నారు. 


1.50 లక్షల మంది అదనంగా పనులకు హాజరు

జిల్లాలో 38 మండలాల్లో 1144 పంచాయతీలు, 4360 అనుబంధ గ్రామాలున్నాయి. వీటిలో 5,03,302 జాబ్‌కార్డులను జారీ చేశారు. 43,955 సమైక్య సంఘాలు రిజిస్ర్టేషన్‌ అయి ఉన్నాయి. కార్డులు కలిగి ఉన్న 7,92,484 మంది వేతనదారులు ఉపాధి పనులకు వెళ్లాల్సి ఉంది. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది ఉపాధి పనులను వినియోగించుకునే వారి సంఖ్య గణనీయంగానే పెరిగిందని చెప్పాలి.


గత ఏడాది జూన్‌ 2 నాటికి 35,937 గ్రూపుల నుంచి 3,32,532 మంది హాజరుకాగా ... ఈ ఏడాది అదే తేదీకి 41,224 గ్రూపుల నుంచి 4,86,302 మంది వేతనదారులు పనులకు హాజరయ్యారు. గత ఏడాదితో పోలిస్తే 1.53,770 మందికి పైగా వేతనదారులు పెరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి. అన్ని వయసుల వారు పనులకు హాజరవుతున్నట్టు అధికారులు చెబుతున్నారు.

Updated Date - 2020-06-03T10:28:35+05:30 IST