అంకితభావం అవసరం

ABN , First Publish Date - 2020-08-20T10:12:48+05:30 IST

వైద్యులు అంకితభావంతో పని చేసి మంచి గుర్తింపు తెచ్చుకోవాలని కలెక్టర్‌ జె.నివాస్‌ హితవు పలికారు. బుధవారం శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన బో

అంకితభావం అవసరం

 కరోనా బాధితులకు సేవ మహోన్నతమైనది

 యువ వైద్యుల చేరికతో వైద్య వ్యవస్థ బలోపేతం

 కలెక్టర్‌ నివాస్‌


 గుజరాతీపేట, ఆగస్టు 19:  వైద్యులు అంకితభావంతో పని చేసి మంచి గుర్తింపు తెచ్చుకోవాలని కలెక్టర్‌ జె.నివాస్‌ హితవు పలికారు. బుధవారం శ్రీకాకుళం  ప్రభుత్వ సర్వజన బోధనాసుపత్రిలో కరోనా బాధితులకు చికిత్స అందజేసే పీజీ వైద్యుల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ‘కరోనా బాధితులకు చికిత్స అందజేయడం మహోన్నతమైన సేవ. వైరస్‌ బారిన పడిన వారిలో ఆత్మస్థైర్యం పెంపొందించాలి.


వారిలో ధైర్యం నింపాలి. దీనివల్ల బాధితులు వైద్యానికి స్పందించి త్వరగా కోలుకుంటారు. పీజీ వైద్యులు చేసే చిన్న ప్రేరణ ఎంతో స్ఫూర్తిని కలిగిస్తుంది. సక్రమంగా రిసీవ్‌ చేసుకోవడం ద్వారా బాధితుల్లో రుగ్మత సగం తగ్గిపోతుంది.  వైద్య వృత్తి, వ్యవస్థపై నమ్మకం కలుగుతుంది. ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందడం లేదని, సరైన సదుపాయాలు కల్పించడం లేదని వస్తున్న పుకార్లకు పుల్‌స్టాప్‌ పెట్టాల్సిన బాధ్యత పీజీ వైద్యులపైనే ఉంది. యువ వైద్యుల చేరికతో శ్రీకాకుళం వైద్య వ్యవస్థ బలోపేతమైంది.


రానున్న రోజుల్లో మంచి మార్పులు చూడగలం’ అని తెలిపారు. అనంతరం కొవిడ్‌ ఆస్పత్రిలోని కంట్రోల్‌ రూమ్‌ను కలెక్టర్‌ తనిఖీ చేశారు. ఏవిధమైన సేవలందుతున్నాయో తెలుసుకున్నారు. బెడ్ల వారీగా బాధితులకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు. కార్యక్రమంలో జేసీలు సుమిత్‌కుమార్‌, ఆర్‌.శ్రీరాములునాయుడు, వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కృష్ణవేణి, జీజీహెచ్‌ పర్యవేక్షకుడు డాక్టర్‌ కృష్ణమూర్తి, ఆర్‌ఎంవో డాక్టర్‌ అరవింద్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-08-20T10:12:48+05:30 IST