చికిత్స కోసం వెళ్లి.. అదృశ్యమైన కరోనా బాధితుడు
ABN , First Publish Date - 2020-08-15T22:15:04+05:30 IST
కరోనా పాజిటివ్ లక్షణాలతో 18 రోజుల కిందట కొవిడ్ ఆస్పత్రిలో చేరిన..
పోలీసులకు కుటుంబ సభ్యుల ఫిర్యాదు
(పొందూరు, ఆగస్టు 14): కరోనా పాజిటివ్ లక్షణాలతో 18 రోజుల కిందట కొవిడ్ ఆస్పత్రిలో చేరిన ఓ బాధితుడు అదృశ్యమయ్యాడు. ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందామని కుటుంబ సభ్యులు రోజూ ఆరా తీస్తున్నా ఆస్పత్రి వర్గాల వద్ద సరైన సమాధానం కరువైంది. దీంతో చివరకు వారు పోలీసులను ఆశ్రయించారు. వివరాల్లోకి వెళితే.. పొందూరు మండలం గోకర్ణపల్లి పంచాయతీ మున్సీపేటకు చెందిన జి.ఈశ్వరరావుకు ఇటీవల కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది.
గత నెల 28న స్థానిక రెవెన్యూ అధికారులు.. ఆయనను చికిత్స నిమిత్తం రాగోలులోని జిల్లా కొవిడ్ ఆస్పత్రి(జెమ్స్)కు తరలించారు. ఆయన జెమ్స్లో చేరినట్టు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. నాలుగు రోజుల తర్వాత ఈశ్వరరావు క్షేమ సమాచారం కరువైంది. ఆయన ఎలా ఉన్నారని కుటుంబ సభ్యులు ఆరా తీయగా, ఆ వ్యక్తి సమాచారం లభించడం లేదని ఆస్పతి వర్గాలు సమాధానమిచ్చాయి. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. అప్పటి నుంచి 13 రోజులుగా ఈశ్వరరావు క్షేమ సమాచారం కోసం ఆయన కుమారుడు రవి ఎన్నో ప్రయత్నాలు చేశారు. రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగాడు. ఆస్పత్రి వర్గాలకు పలుమార్లు ఫోన్ చేశాడు. అయినప్పటికీ ఈశ్వరరావు వివరాలు లభ్యం కాలేదని ఆస్పత్రి వర్గాలు తెలియజేయడంతో కుటుంబ సభ్యులంతా కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఈశ్వరరావు భార్య కల్యాణి, కుమారుడు రవి శుక్రవారం పొందూరు పోలీసులను ఆశ్రయించారు. కరోనా లక్షణాలతో ఆస్పత్రిలో చేరిన.. తన తండ్రి ఆచూకీ లభ్యం కావడం లేదంటూ రవి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేస్తామని ఎస్ఐ రామారావు తెలిపారు. అలాగే తహసీల్దార్ మధుసూదనరావు, డిప్యూటీ తహసీల్దార్ నారాయణమూర్తిలను కూడా బాధిత కుటుంబ సభ్యులు రెండు రోజుల కిందట కలిశారు. గత నెల 28న తామే జెమ్స్కు తరలించామన్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతానని తహసీల్దార్ మధుసూదనరావు చెప్పారు. ఈశ్వరరావు క్షేమ సమాచారంపై ఆరా తీస్తున్నామని వివరించారు.