దర భళా.. దిగుబడి లేక డీలా
ABN , First Publish Date - 2020-11-03T05:30:00+05:30 IST
కొబ్బరి ధరలు ఆకాశం వైపు వెళుతుంటే... దిగుబడి మాత్రం నేల చూపులు చూస్తోంది.
రికార్డు స్థాయికి కొబ్బరి ధరలు
వెయ్యి కాయలు రూ.26 వేలు
ఉద్దానంలో భారీగా తగ్గిన పంట దిగుబడి
తుఫాన్లు, తెగుళ్లతో పడిపోయిన ఉత్పత్తి
లబోదిబోమంటున్న రైతులు
(కంచిలి)
కొబ్బరి ధరలు ఆకాశం వైపు వెళుతుంటే... దిగుబడి మాత్రం నేల చూపులు చూస్తోంది. కాయలు రికార్డు స్థాయిలో ధర పలుకుతుంటే.. అదే స్థాయిలో ఉత్పత్తి పతనమవుతోంది. ధర ఉన్నా అమ్ముకోవడానికి పంట లేకపోవడంతో ఉద్దానం రైతులు దిగాలు పడుతున్నారు. ఒకప్పుడు దసరా, దీపావళి సీజన్లో ఉద్దానంలో కొబ్బరికాయల దిగుబడి మెరుగ్గా ఉండేది. ధరలు కూడా ఆశాజనకంగా ఉండేవి. గత పదేళ్లుగా వరుస తుఫాన్లు, తెగుళ్ల కారణంగా దిగుబడి భారీగా పడిపోయింది. అందుకే ధరలు పెరిగినా ఆ ఆనందం రైతుల్లో కనిపించడం లేదు.
200 కాయల ఉత్పత్తే గగనం ఈ ఏడాది రికార్డు స్థాయిలో వెయ్యి కాయల ధర రూ.26వేల వరకు పలుకుతోంది. హోల్సేల్లో ఇలా ఉంటే... రిటైల్లో మాత్రం ఒక్కో కాయ రూ.25 నుంచి రూ.40 వరకు పలుకుతోంది. కానీ, ఆ స్థాయిలో దిగుబడి లేకపోవడం రైతులకు శరాఘాతంగా మారింది. పంట కొనుగోలుకు రైతుల వద్దకు వస్తున్న వ్యాపారులు కాయలు లేవని తెలిసి వెనుదిరుగుతున్నారు. గతంలో వెయ్యి కాయలు వరకు ఉత్పత్తి చేసే రైతు నేడు 200 కాయలను అందించడం గగనమైంది. మరోవైపు నిత్యం దళారుల మధ్య ఈ వ్యాపారం సాగుతుంది. పంట దిగుబడి లేకపోవడాన్ని గుర్తించిన కొందరు వ్యాపారులు ముం దుగానే గ్రామాలకు వచ్చి రైతులకు అడ్వాన్స్ ఇస్తున్నారు. వచ్చినకాడికి పంటను వారికే అమ్మేలా యత్నిస్తున్నారు. ఇదే అదునుగా కొందరు కోనసీమలో లభ్యమయ్యే కాయలను తీసుకువచ్చి రైతుల తోటల్లో నిల్వచేసి ఉద్దానం కాయలుగా చెప్పి అమ్మకాలు చేపడుతున్నారు. ఇదిలాఉండగా ఒకప్పుడు కొబ్బరి కాయలతో కళకళలాడే కంచిలి వ్యాపార కేంద్రం నేడు వెలవెలబోతోంది. గతంలో పండగల సీజన్లో ఇక్కడ అధికంగా కాయల ఎగుమతులు జరిగేవి. అలాంటిది ప్రస్తుతం ఈ కేంద్రంలో అరకొరగా ఎగుమతులు జరుగుతున్నాయి. ఇక్కడ వెయ్యి కాయల ధర రూ.17వేల నుంచి రూ.18వేల వరకు పలుకుతోంది. ఒడిశా, తదితర ప్రాంతాల నుంచి వచ్చిన వ్యాపారులు మాత్రమే రికార్డు ధర పలికిస్తున్నారు.
ఇంకా కోలుకోని ఉద్దానం కొబ్బరి
1999 నుంచి ఉద్దానంపై ప్రకృతి ప్రకోపం చూపుతోంది. ఆ ఏడాది నుంచి ప్రారంభమైన పెను తుపాన్ల పరంపర ఇంకా కొనసాగుతోంది. తితలీ, పైలిన్, వంటి తుఫాన్లు విరుచుకుపడడంతో ఉద్దానంలో వేల ఎకరాల్లో కొబ్బరి చెట్లు నేలకొరిగాయి. నేటికీ ఆ నష్టం నుంచి రైతులు తేరుకోలేదు. వరుస తుఫాన్ల తాకిడితో కొబ్బరి కాయల దిగుబడి అనూహ్యంగా పడిపోయింది. దీనికి తోడు ఎర్రనల్లి, తెల్లదోమ తెగుళ్లు కొబ్బరి కాయలు, చెట్ల స్థితిగతులనే మార్చేశాయి. చెట్ల ఎదుగుదల, దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపాయి. ఎకరా తోటలో రెండు నెలల కాలానికి ఆరుపణాలు వరకు (పణం 80కాయలు)తీస్తే ప్రస్తుతం రెండు పణాలు రావడం కష్టమైందని రైతులు వాపోతున్నారు. దీనికి తోడు వ్యాపారులు, దళారులు కలసి పణం కాయలకు రెండు, నాలుగు కాయలు అదనంగా జమ చేసి తమను మోసగిస్తున్నారని రైతులు లబోదిబోమంటున్నారు.
అమ్ముకోవడానికి పంట లేదు
ఒకప్పుడు కొబ్బరి దిగుబడి మెరుగ్గా ఉండి బతుకులను ఆనందంగా సాగించేవాళ్లం. కానీ, వరుసగా తుఫాన్లు, తెగుళ్లతో పంట దిగుబడి తగ్గి నష్టాలు వస్తున్నాయి. మార్కెట్లో ధర ఉన్నా అమ్ముకోవడానికి మా చేతిలో పంట లేదు. ప్రభుత్వమే మమ్మల్ని ఆదుకోవాలి.
- టీవీ రమణ, రైతు, మఖరాంపురం