స్థానిక ఎన్నికలకు బ్రేక్!
ABN , First Publish Date - 2020-03-16T09:24:52+05:30 IST
కరోనా ప్రభావం స్థానిక సంస్థల ఎన్నికలపై పడింది. చిగురుటాకులా వణికిస్తున్న ఈ ప్రాణాంతక వైరస్తో ప్రపంచ దేశాలు అప్రమత్తమవుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తుగా
కరోనా ప్రభావంతో ఆరువారాల పాటు వాయిదా
జిల్లాలో నిలిచిపోయిన ప్రక్రియ
అభ్యర్థులకు ఊహించని షాక్
కొందరిలో మోదం..మరికొందరికి ఖేదం
అధికార యంత్రాంగానికి తాత్కాలిక ఉపశమనం
(శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి)
కరోనా ప్రభావం స్థానిక సంస్థల ఎన్నికలపై పడింది. చిగురుటాకులా వణికిస్తున్న ఈ ప్రాణాంతక వైరస్తో ప్రపంచ దేశాలు అప్రమత్తమవుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తుగా ప్రకటించింది. అన్ని రాష్ట్రాలనూ అప్రమత్తం చేసింది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజారోగ్యం దృష్ట్యా వాయిదా వేసినట్టు కమిషనర్ రమేష్కుమార్ ప్రకటించారు. దీంతో ఎన్నికల ప్రక్రియ తాత్కాలికంగా నిలిచిపోయింది. ఎన్నికల నిర్వహణకుగాను అధికారులకు ఇచ్చే శిక్షణ సైతం రద్దుచేస్తూ జిల్లా రెవెన్యూ అధికారి ఉత్తర్వులిచ్చారు. ఇప్పటికే 667 ఎంపీటీసీ స్థానాలు, 38 మంది జడ్పీటీసీ స్థానాలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది.
శనివారం అర్థరాత్రి బరిలో నిలిచే అభ్యర్థుల తుది జాబితాను అధికారులు ప్రకటించారు. అభ్యర్థులు ప్రచారపర్వంలోకి దిగిపోయారు. మరోవైపు జిల్లాలో ఇచ్ఛాపురం, పలాస-కాశీబుగ్గ మునిసిపాల్టీలతో పాటు పాలకొండ నగర పంచాయతీకి సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఆదివారం పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువరించడానికి యంత్రాంగం అన్నివిధాలా ఏర్పాట్లు చేసుకున్న తరుణంలో ఏకంగా ఎన్నికలను వాయిదా వేస్తూ ప్రకటన రావడంతో ఎక్కడి ప్రక్రియ అక్కడే నిలిచిపోయింది.
కొందరిలో నిరాశ
ఎన్నికల వాయిదా కొందరిలో మోదం.. మరికొందరిలో ఖేదం మిగిల్చింది. చాలా మంది అభ్యర్థులు కరపత్రాలను ముద్రించి, ప్రచార వాహనాల అనుమతులు సంపాదించి ప్రచారంలో అడుగుపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కొందరైతే ఇప్పటికే ప్రచారంలో చుట్టేస్తున్నారు. ఇటువంటి వారిలో నిరాశ అలుముకుంది. మరికొందరు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తక్కువ సమయం ఉండడంతో ఓటర్లను నేరుగా కలవడానికి వీల్లేకుండాపోయేదని.. ఆరు వారాల సమయం దొరకడంతో అందర్నీ కలిసి ఓటు అభ్యర్థించడానికి వీలవుతుందని భావిస్తున్నారు.
ఇప్పటికే నామినేషన్ దాఖలు చేసిన సమయంలో భారీగా ఖర్చు పెట్టిన వారికి నిరాశే మిగిలింది. ఎన్నికల వాయిదాతో వివిధ రాజకీయ పార్టీలు తమ ప్రచారాలను ఒక్కసారిగా నిలుపుదల చేసి తిరిగి ఎవరి పనుల్లో వారు నిమగ్నమయ్యారు.కాగా స్వగ్రామాలకు వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకున్న వలస కూలీలు ప్రయాణాలను వాయిదా వేసుకున్నారు.
పంచాయతీ నోటిఫికేషన్ కూడా..
జిల్లాలో 1190 పంచాయతీలకుగాను ఎన్నికలు నిర్వహించేందుకుగాను షెడ్యూల్ ప్రకారం ఆదివారం నోటిఫికేషన్ విడుదల కావాల్సిఉంది. స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా ప్రక్రియతో పాటుగా సర్పంచ్ ఎన్నికల నోటిషికేషన్ను కూడా ఆరువారాల పాటు వాయిదావేశారు. ఆతర్వాత ఎప్పుడు నిర్వహిస్తారన్నది నోటిఫికేషన్ విడుదలవుతుంది. ఇప్పటికే పింఛన్లు మంజూరుచేయడం, రేషన్కార్డులు, ఇళ్లస్థలాలు ఇప్పిస్తామని.. ఇలా హామీలు ఇచ్చేసి... వీలైనంతవరకు అందరినీ మంచిచేసుకునే పనిలో నిమగ్నమైన సర్పంచ్ పదవి ఆశావహులకు కరోనా ఊహించని విధంగా ఖంగుతినిపించింది.
ఇదిలా ఉండగా అధికార యంత్రాంగం మాత్రం ఊపిరి పీల్చుకుంది. ఇటు తల్లితండ్రులు.. తమపిల్లల పరీక్షల నేపథ్యంలో ఎన్నికలే వాయిదాపడడం.. పైగా కరోనా వ్యాప్తిజరగకుండా ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకోవడంపై ఆనందం వ్యక్తంచేస్తున్నారు.