ఆటో... ట్రాక్టర్ ఢీ
ABN , First Publish Date - 2020-11-22T05:07:03+05:30 IST
Auto ... Tractor Dhee
12 మంది కూలీలకు గాయాలు
శ్రీకాకుళం, కొండములగాం ఆస్పత్రులకు తరలింపు
వరి కోతల నుంచి వస్తుండగా ఘటన
క్షతగాత్రులంతా నెలివాడ వాసులే
రణస్థలం, నవంబరు 21: వరి కోతలు పూర్తి చేసుకొని ఆటోపై ఇంటికి వస్తున్న కూలీలను ట్రాక్టర్ ఢీకొంది. ఈ ఘటనలో 12 మంది కూలీలు గాయపడ్డారు. వీరిని స్థానికులు ఆస్పత్రులకు తరలించారు. వివరాల్లోకి వెళ్తే... నెలివాడ గ్రామానికి చెందిన కొంతమంది మహిళలు శనివారం ఉదయం వరి కోతల కోసం విజయనగరం జిల్లా కందివలస గ్రామం వెళ్లారు. వరి కోత పూర్తయిన తరువాత వారంతా సాయంత్రం ఆటోలో స్వగ్రామానికి బయలుదేరారు. నెలివాడ జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై వారు ప్రయాణిస్తున్న ఆటోను ట్రాక్టర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో కోరాడ లక్ష్మి, కోరాడ పెంటమ్మ, బద్దాన లక్ష్మి, బద్దాన నారాయణ, ఎలుసూరి సరస్వతి, ఇప్పిలి సూరమ్మ, ఇప్పిలి అప్పమ్మ, మల్లాడ సుగుణ, నోపాడ లక్ష్మి, ఇజ్జురోతు సరోజిని, నాసర మంగమ్మ, ఆటో డ్రైవర్ నౌపాడ రామారావులు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక యువకులు శ్రీకాకుళం, కొండములగాం ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. పొట్టకూటి కోసం వేరే గ్రామం వెళ్లి వస్తున్న గ్రామ మహిళలు రోడ్డు ప్రమాదానికి గురవడంతో నెలివాడలో విషాదఛాయలు అలముకున్నాయి. ట్రాక్టర్ డ్రైవర్ను అదుపులోకి తీసుకొని, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు జేఆర్పురం ఎస్ఐ శ్రీనివాసరావు తెలిపారు.