కరోనా కేసుల కోసం ఏర్పాట్లు చేయండి
ABN , First Publish Date - 2020-04-08T12:03:50+05:30 IST
‘జిల్లాలో ఇంతవరకూ కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాలేదు. ఒకవేళ ఏమైనా కేసులు నమోదైతే.. చికిత్స చేసేందుకు

ప్రైవేటు ఆస్పత్రులకు కలెక్టర్ జె.నివాస్ ఆదేశం
గుజరాతీపేట, ఏప్రిల్ 7: ‘జిల్లాలో ఇంతవరకూ కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాలేదు. ఒకవేళ ఏమైనా కేసులు నమోదైతే.. చికిత్స చేసేందుకు సిద్ధంగా ఉండాలి. ఇందుకోసం పక్కాగా ఏర్పాట్లు చేయాలి’ అని కలెక్టర్ జె.నివాస్ ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలను ఆదేశించారు. మంగళవారం శ్రీకాకుళం నగరంలోని గొలివి, శాంతి ప్రైవేట్ అసుపత్రుల్లో సౌకర్యాలు, వైద్యులు, సిబ్బంది వివరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘కరోనా వైరస్ నేపథ్యంలో రోగులకు చికిత్సల కోసం ఎంపిక చేసిన ప్రైవేట్ ఆసుపత్రుల్లో అన్ని ఏర్పాట్లను ముందస్తుగా సమకూర్చుకోవాలి. చికిత్స చేసే వైద్యులు, సిబ్బందికి ప్రత్యేక వసతిని కేటాయించాలి. విధులు పూర్తయ్యాక పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ను విసర్జించేందుకు ప్రభుత్వ సూచనల అనుగుణంగా ఏర్పాట్లు చేయాలి. సాధ్యమైనంత వరకూ ఐసీయూకు దగ్గరగా ఉండాలి.
డాక్టర్లు, సిబ్బంది భద్రత ముఖ్యం. చికిత్స అందించే రోజుల్లో ఎవరితోనూ వైద్యులు, సిబ్బందికి సంబంధాలు ఉండవు. వైద్యులు, సిబ్బంది కనీసం రెండు షిఫ్ట్ల్లో విధులు నిర్వహించేందుకు షెడ్యూల్ను నిర్ణయించాలి. 14 రోజులకు ఒక బ్యాచ్ చొప్పున జెమ్స్ ఆసుపత్రిలో ఏర్పాట్లు చేస్తున్నా’మని వివరించారు. పేషెంట్లతో కాంటాక్టులో ఉండే వారిని వేరు చేయాలని తెలిపారు. కరోనా వైద్యం అందించే ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ కింద ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల మేరకు నిధులు చెల్లించనున్నట్లు తెలిపారు.