ఏపీలో కరోనా టెస్ట్‌ల ధరలు తగ్గాయ్..!

ABN , First Publish Date - 2020-12-16T02:49:58+05:30 IST

ఏపీలో కరోనా టెస్ట్‌ల ధరలను తగ్గిస్తూ ఏపీ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. కోవిడ్-19 నిర్ధారణ పరీక్షలకు సంబంధించిన...

ఏపీలో కరోనా టెస్ట్‌ల ధరలు తగ్గాయ్..!

అమరావతి: ఏపీలో కరోనా టెస్ట్‌ల ధరలను తగ్గిస్తూ జగన్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. కోవిడ్-19 నిర్ధారణ పరీక్షలకు సంబంధించిన కిట్లు అందుబాటులోకి రావడంతో ధరలు తగ్గిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఆర్టీపీసీఆర్ టెస్ట్‌ల ధరలను తగ్గిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. ప్రభుత్వం పంపే శాంపిళ్ల టెస్టు ధరలను రూ.800 నుంచి రూ.475కు, నేషనల్ అక్రెడిటేషన్‌ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబరేషన్ లేబరేటరీస్(ఎన్‌ఏబీఎల్) ల్యాబ్స్‌లో కరోనా టెస్ట్ ధరను రూ.1000 నుంచి రూ.499కు తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా నిర్ధారణకు చేసే ఆర్టీపీసీఆర్‌, యాంటీజెన్‌ కిట్ల ధరలు భారీగా తగ్గడంతో.. ఆర్టీపీసీఆర్‌ టెస్టుకు రూ.925 వసూలు చేయాలని భారత వైద్యపరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) ఇటీవలే ఆదేశాలు కూడా జారీ చేసిన సంగతి కూడా తెలిసిందే.


తొలినాళ్లలో ఆర్టీపీసీఆర్‌ కిట్లు, వాటిలో వాడే రీయేజెంట్స్‌ ధర కలిపి రూ.2500 దాకా ఉండేది. దీంతో కేంద్రం రూ.4500 వరకు వసూలు చేయొచ్చని అప్పట్లో సూచించింది. అప్పట్లో కరోనా నిర్ధారణకు ఆర్టీపీసీఆర్‌ టెస్టు ఒక్కటే దిక్కు. ఒకటి రెండు కంపెనీలు మాత్రమే వాటిని ఉత్పత్తి చేసేవి. విదేశాల నుంచే వాటిని దిగుమతి చేసుకోవాల్సి వచ్చేది. దాంతో వాటి ధర అంత ఎక్కువగా ఉండేది. ప్రైవేటు ల్యాబ్‌లలో డిమాండ్‌ను బట్టి రూ.4500 నుంచి రూ.5500 వరకు వసూలు చేసేవారు. అలాంటిది ఇప్పుడు ఆర్టీపీసీఆర్‌ కిట్టు ధర ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో రూ.250కి చేరింది.

Updated Date - 2020-12-16T02:49:58+05:30 IST