పట్టణాల్లోనూ తొలి రోజు నామమాత్రమే

ABN , First Publish Date - 2020-03-12T08:23:32+05:30 IST

పురపోరు ఎన్నికలు కీలక ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. తొలిరోజు నామినేషన్లు దాఖలుకు అంతగా

పట్టణాల్లోనూ తొలి రోజు నామమాత్రమే

ఒంగోలు, మార్చి 11 (ఆంధ్రజ్యోతి) : పురపోరు ఎన్నికలు కీలక ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. తొలిరోజు నామినేషన్లు దాఖలుకు అంతగా అభ్యర్థులు ముందుకు రాలేదు. నామమాత్రంగానే నామినేషన్లు దాఖలయ్యాయి. జిల్లాలో ప్రస్తుతం ఒంగోలు కార్పొరేషన్‌తో పాటు మరో రెండు మున్సిపాలిటీలు, నాలుగు నగర పంచాయతీల్లో మొత్తం 50 కార్పొరేషన్‌ డివిజన్లు, 148 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే తొలిరోజు అద్దంకి, చీమకుర్తిలలో ఒక్క నామినేషన్‌ కూడా దాఖలు కాలేదు. మిగిలిన వాటిలో కేవలం 15 మంది నామినేషన్లు వేశారు. అందులో9 నామినేషన్లు వైసీపీ తరుపున దాఖలు కాగా 4 టీడీపీ తరుపన మరో రెండు ఇతరులు వేశారు. ఆయా పట్టణ ప్రాంత సంస్థల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను అధికారులు స్వీకరించారు.


కాగా, పరిషత్‌ అభ్యర్థుల నామినేషన్లకు బుధవారం చివరి రోజు కావడంతో ప్రధాన పార్టీల ముఖ్యనేతలు సంబంధిత వ్యవహారంలో తలమునకలై ఉన్నారు. దీంతో మున్సిపల్‌ అభ్యర్థిత్వాలు ఆశిస్తున్న వారికి గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడం లేదా అభ్యర్థుల ఎంపిక చేయడంలో జాప్యం జరుగుతోంది. కొంత మందికి స్పష్టత ఉన్న నామినేషన్ల దాఖలుకు అవసరమైన ధ్రువపత్రాలు సేకరణ ఆలస్యం నేపథ్యంలో తొలిరోజైన బుధవారం జిల్లాలో మున్సిపల్‌ నామినేషన్లు పరిమితంగానే దాఖలయ్యాయి. ఒంగోలు కార్పొరేషన్‌లో 50 డివిజన్లు ఉండగా బుధవారం ఐదు నామినేషన్లు దాఖలయ్యాయి. అందులో వైసీపీ నుంచి 3, కాగా టీడీపీ నుంచి 1, జనసేన 1 వచ్చాయి.


చీరాలలో 33 వార్డులు ఉండగా వైసీపీ నుంచి 2, ఇతరులు 1 దాఖలు చేశారు. మార్కాపురంలో 35 వార్డులకు వైసీపీ నుంచి ఒకే ఒక్క నామినేషన్‌ దాఖలైంది. గిద్దలూరులో 20 వార్డులకు రెండు దాఖలు కాగా అవి టీడీపీ అభ్యర్థులు వేశారు. కనిగిరి  నగర పంచాయతీలో 20 వార్డులకు మూడు దాఖలు కాగా వాటిని వైసీపీ అభ్యర్థులే సమర్పించారు. కాగా మున్సిపల్‌ నామినేష్ల దాఖలుకు మరో రెండు రోజులు గడువు ఉంది. గురు, శుక్రవారాల్లో భారీగానే నామినేషన్లు వేసే అవకాశం ఉంది. 

Updated Date - 2020-03-12T08:23:32+05:30 IST