పన్నుల పెంపుపై టీడీపీ నిరసన

ABN , First Publish Date - 2020-12-12T04:21:27+05:30 IST

పట్టణాల్లో ఆస్తి పన్నులు, నీటి పన్నులు పెంపుపై తెలుగుదేశం పార్టీ నిరసన తెలియజేసింది. శుక్రవారం ఒంగోలు కార్పొరేషన్‌ కార్యాలయం ఎదుట నిర్వహించిన ఆందోళనలో పార్టీశ్రేణులు రాష్ట్రప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

పన్నుల పెంపుపై    టీడీపీ నిరసన
ఒంగోలు కార్పొరేషన్‌ కార్యాలయం ఎదుట నిరసన తెలుపుతున్న టీడీపీ శ్రేణులు

ఒంగోలు (కార్పొరేషన్‌) డిసెంబరు 11 : పట్టణాల్లో ఆస్తి పన్నులు, నీటి పన్నులు పెంపుపై తెలుగుదేశం పార్టీ నిరసన తెలియజేసింది. శుక్రవారం ఒంగోలు కార్పొరేషన్‌ కార్యాలయం  ఎదుట నిర్వహించిన ఆందోళనలో పార్టీశ్రేణులు రాష్ట్రప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌ నుంచి ఇంటి పన్ను, ఖాళీస్థలం పన్ను, వ్యాపార పన్నులు, తాగునీటి పన్నుల పెంచేందుకు తీసుకున్న నిర్ణయం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. దీంతో పేద, బడుగు, బలహీనవర్గాల వారిపైనే కాకుండా అద్దెకు నివాసం ఉండే వారిపైనా ఆర్థికభారం పడుతుందన్నారు. నగరవాసులకు స్వచ్ఛమైన నీరు అందించాలని డిమాండ్‌ చేశారు. ఏలూరు ఘటన అందరినీ కలవరపెడుతున్న నేపథ్యంలో ఒంగోలులో తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌చేశారు. నగరంలో వీధులు అపరిశుభ్రంగా ఉన్న కారణంగా దోమల అధికమయ్యాయని, వెంటనే పారిశుధ్యం మెరుగుపరచాలన్నారు. అనంతరం నగర కమిషనరు కే.భాగ్యలక్ష్మిని కలిసి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు కొఠారి నాగేశ్వరరావు, డాక్టర్‌ గుర్రాల రాజ్‌విమల్‌, కామేపల్లి శ్రీనివాసరావు, నల్లూరి కిషోర్‌, దాయనేని ధర్మ, కామరాజుగడ్డ కుసుమకుమారి, పసుపులేటి వెంకటసునీత, ఆర్ల వెంకటరత్నం పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.  

Updated Date - 2020-12-12T04:21:27+05:30 IST