కదిలించిన ‘రాములమ్మ’

ABN , First Publish Date - 2020-11-20T05:16:24+05:30 IST

పెన్షన్‌ రాని అనాథ వృద్ధులకు వెంటనే చేయూత అందించేందుకు యంత్రాంగం కదిలింది. వృద్ధురాలు రాములమ్మ దీనగాథ గురించి ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనంతో స్పందించి తానా సహాయ సహకారాలు అందించింది.

కదిలించిన ‘రాములమ్మ’
ఆశ్రమంలోని వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేస్తున్న చిత్రం

 

ఒంగోలు(జడ్పీ), నవంబరు 19: పెన్షన్‌ రాని అనాథ వృద్ధులకు వెంటనే చేయూత అందించేందుకు యంత్రాంగం కదిలింది. వృద్ధురాలు రాములమ్మ దీనగాథ గురించి ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనంతో స్పందించి తానా సహాయ సహకారాలు అందించింది. దాంతో పాటు మహిళా కమిషన్‌ సభ్యురాలు తమ్మిశెట్టి రమాదేవి, సేవా వలంటీర్‌ బాషా చొరవతో ఆమెకు న్యాయం జరిగిన విషయం తెలిసిందే. ఆ ఉదంతాన్ని దృష్టిలో పెట్టుకుని నిరాశ్రయులై, చిరునామా కూడా సరిగాలేని రాములమ్మ లాంటి వృద్ధులందరికీ పెన్షన్‌ అందే ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ పోలా భాస్కర్‌ను బుధవారం మహిళా కమిషన్‌ సభ్యురాలు రమాదేవి కలిసి విన్నవించారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన కలెక్టర్‌ పోలాభాస్కర్‌ ఆశ్రమంలో ఉంటూ పెన్షన్‌ అందని వారి వివరాలను సేకరించాలని సంబంధిత సిబ్బందికి ఆదేశాలిచ్చారు. దానిలోభాగంగా మోటుమాలలో ఉన్న రమణమహర్షి ఆశ్రమానికి గురువారం సిబ్బంది వచ్చి అక్కడ ఆశ్ర యం పొందుతున్న వారి వివరాలను సేకరించారు. రాములమ్మ ఉదంతంతో ఆదరణ లేక, పెన్షన్‌ అందక ఇబ్బందిపడుతున్న ఎంతోమంది ముదిమి వయసు వారికి న్యాయం జరగనుంది. అంతేకాకుండా జిల్లావ్యాప్తంగా ఉన్న వృద్ధాశ్రమాల్లో నెలకోసారి విధిగా ఆరోగ్య పరీక్షలు కూడా చేపట్టే విధంగా చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ తెలిపారు.  

తానా సహకారంతో దుప్పట్ల పంపిణీ

తానా సహకారంతో గురువారం మోటుమాల ఆశ్రమంలోని వృద్ధులకు దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తానా సభ్యుడు, గుంటూరు జిల్లా వట్టిచెరుకూరుకు చెందిన ఉప్పుటూరి రామ్‌చౌదరి తల్లిదండ్రులు ఉప్పుటూరి చినరాములు, సీతామహలక్ష్మీతో పాటు మహిళా కమిషన్‌ సభ్యురాలు  రమాదేవి, చిన్నయ్య, సేవా వలంటీర్‌ బాషా తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2020-11-20T05:16:24+05:30 IST