పురాతన శివాలయంలో దుండగుల దుశ్చర్య
ABN , First Publish Date - 2020-08-20T17:50:57+05:30 IST
కురిచేడులోని అతి పురాతన శివాలయంలో మంగళవారం రాత్రి దుండగలు..

విద్యుత్ వ్యవస్థ ధ్వంసం
ఇప్పటికి 6 సార్లు ఆలయంపై దాడి
రెండు సార్లు చోరీలు
కురిచేడు(ప్రకాశం): కురిచేడులోని అతి పురాతన శివాలయంలో మంగళవారం రాత్రి దుండగలు దుశ్చర్యకు పాల్పడ్డారు. విద్యుత్ వ్యవస్థ మొత్తం నాశనం చేశారు. ఆలయం లోపల ఉన్న విద్యుత్ మీటరు, ఆలయం ఆవరణలోని విద్యుత్ వైర్లు, మోటారు ప్యానల్ బోర్డును ధ్వంసం చేశారు. ఎక్కడికక్కడ విద్యుత్ వైర్లు కట్ చేశా రు. ఇప్పటికే పలుమార్లు ఈ ఆలయంపై దాడులు జరిగి నా పాలకులు కానీ, ఆలయ కమిటీ కానీ సరైన చర్యలు తీసుకోక పోవడం వల్లనే మళ్లీమళ్లీ ఇలా జరుగుతున్నదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కురిచేడులో క్రీస్తుశకం 1092వ సంవత్సరంలో కుళోత్తుంగ రాజేంద్ర చోళ మహారాజు కాళహస్తీశ్వరస్వామి ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయంలో కాళహస్తీశ్వరుని కి ఎదురుగా ప్రతిష్ఠించిన నంది దేశంలో మరే ఆలయం లోనూ లేదు. అప్పట్లో శివరాత్రి ఉత్సవాలు, కల్యాణం, పా రువేట, యజ్ఞయాగాదులు ఘనంగా జరిగాయి. ఆనాటి పురాతన శివాలయంపై దుండగుల దుశ్చర్యలు గత కొం తకాలం నుంచి జరుగుతున్నాయి. శివుడి ఎదురుగా ఉన్న పాత ధ్వజ స్తంభం ఇత్తడి తొడుగును గుర్తు తెలియని వ్యక్తు లు సుత్తితో ప గులగ్గొట్టారు. తరువాత అక్కడ నూతన ధ్వజ స్తంభాన్ని ప్రతిష్ఠించారు. జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారి ఆలయంలోని తాళాలు పగులకొట్టి అమ్మవారి ముఖానికి కుంకుమ పూసి పాత చినిగిపోయిన చీరను కట్టి అపవిత్రం చేశారు. పెద్ద నంది మూతిని పగులగొట్టారు. రెండు దఫాలుగా శివాలయం లోపల ఉన్న రెండు పురాతన నందులను చోరీ చేశారు.
గర్భగుడి తాళాలు పగులకొట్టి లోపలికి దూరి అక్కడే ఉన్న శఠారు, గంట, మరికొన్ని మాయం చేశారు. ఆ దొంగను పట్టుకుని కోర్టులో ప్రవేశ పెట్టారు. అతనికి శిక్ష పడి దానిని పూర్తి చేసుకుని ఇంటికి చేరాడు కానీ దొంగతానికి గురైన శఠారు, గంట మాత్రం ఆలయానికి ఇంకా చేరలేదు. తాజాగా ఆలయంలో విద్యుత్ వ్యవస్థ మొత్తం ధ్వంసం చేశారు. మీటరు బోర్డును పగులకొట్టి దూరంగా పడవేశారు. మోటారుకు విద్యుత్ అందించే వైర్లు కట్ చేశారు. విద్యుత్ బోర్డును ముక్కలు ముక్కలు చేశారు.
పాలకులు, ఆలయ కమిటీ విఫలం
పురాతన ఆలయంపై ఇన్ని రకాల దాడులు జరుగుతున్నా పాలకులు గానీ, ఆలయ కమిటీ కానీ సరైన రక్షణ చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారు. పోలీసులు పలు మార్లు సీసీ కెమెరాలు బిగించమని సలహా ఇచ్చారు. ఆచరణలో కార్యరూపం దాల్చలేదు. విద్యుత్ వ్యవస్థ ధ్వంసంపై ఆలయ కమిటీ అధ్యక్షుడు కట్టమూరి నాగేశ్వరరావు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చి శివాలయం లో జరిగిన సంఘటనను పరిశీలించారు.