శానిటైజర్‌ చంపేసింది

ABN , First Publish Date - 2020-08-01T10:47:15+05:30 IST

కురిచేడుకు చెందిన వారంతా పేదలు. అందులో కొందరు రెక్కాడితేకాని డొక్కాడని శ్రమజీవులు. మరికొందరు యాచకులు...

శానిటైజర్‌ చంపేసింది



చెట్టు కింద కూర్చున్న వ్యక్తి అక్కడే కాళ్లూ, చేతులూ గిలగిలా తన్నుకుంటూ ప్రాణాలు విడిచాడు. కూలి పనికి వెళ్లి ఇంటికి వచ్చిన మరో వ్యక్తి కొద్దిసేపటికే పెద్దగా కేకలు వేస్తూ కుప్పకూలాడు. కుటుంబసభ్యులతో మాట్లాడుతూనే మరో వ్యక్తి దాహం.. దాహం.. అంటూ అరుస్తూ నేలకొరిగాడు. వీరితోపాటు నిద్రలోనే శాశ్వత నిద్రలోకి వెళ్లిన వారు కొందరైతే, వైద్యశాలలో చికిత్స పొందూతూ ప్రాణాలు విడిచిన వారు మరికొందరు. ఇలా.. మత్తు కోసం సేవించిన శానిటైజర్‌ ఆ బడుగు జీవుల జీవితాలకు ముగింపు పలికింది. 24 గంటల వ్యవధిలో 13 మంది ప్రాణాలను బలిగొంది.     


ఈ పెనువిషాదం మండల కేంద్రమైన కురిచేడులో జరిగింది. మృతుల కుటుంబాలకు అంతులేని శోకాన్ని మిగిల్చింది. ఈ సంఘటనతో యంత్రాంగం ఉలిక్కిపడింది. పోలీసులతోపాటు, ఇతర శాఖల అధికారులు కురిచేడుకు పరుగులు తీశారు. సంఘటనపై విచారణ చేపట్టారు. కల్తీ శానిటైజర్‌ తాగడమే మరణాలకు కారణమని అనుమానిస్తున్నారు. మృతుల్లో నలుగురికి కరోనా పాజిటివ్‌ ఉన్నట్లు తేలడంతో  అధికారులు వణికిపోతున్నారు. మరోవైపు పామూరులోనూ శానిటైజర్‌ తాగి వారం వ్యవధిలో  ముగ్గురు మరణించారు. 


కురిచేడు, జూలై 31 : కురిచేడుకు చెందిన వారంతా పేదలు. అందులో కొందరు రెక్కాడితేకాని డొక్కాడని శ్రమజీవులు. మరికొందరు యాచకులు. అలాంటి వారు మద్యానికి బానిసయ్యారు. కరోనా ఉధృతి నేపథ్యంలో కంటైన్‌మెంట్‌ ఆంక్షలు అమ లవుతూ వైన్‌ షాపులు మూతడటం, లిక్కర్‌ ధరలు కూడా ఎక్కువ ఉండటంతో తక్కువ ధరకు ఎక్కువ మత్తు ఇచ్చే శానిటైజర్‌ను తాగడం ప్రారంభించారు. పది రోజులుగా దాన్ని సేవిస్తున్నారు. ఏం జరిగిందో ఏమో కాని శానిటైజర్‌ తాగిన వారిలో గురువారం రాత్రి 6.30 నుంచి విపరీత లక్షణాలు కనిపించాయి. ఆతర్వాత ఒకరి వెంట ఒకరు 24 గంటల వ్యవధిలో 13 మంది ప్రాణాలు విడిచారు. 


మద్యం బాటిళ్లలో ఆల్కహాల్‌ 40శాతం మాత్రమే ఉంటుంది. శానిటైజర్లలో మాత్రం 70 శాతం ఉంటుంది. అది తక్కువ ధరకు లభిస్తుండటంతో కురిచేడుకు చెందిన కొందరు పేదలు దానికి అలవాటుపడ్డారు.  అదేవారి జీవితాలకు చరమగీతం పాడింది. మృతుల్లో ఎనిమిది మంది కురిచేడులోని ఇళ్ల వద్దనే నేలకొరిగారు. ముగ్గురు దర్శి వైద్యశాలలో, మరొకరు వినుకొండ ఆసుపత్రిలో ప్రాణాలు విడిచారు. 


ఒకరి తర్వాత ఒకరు.. 

శానిటైజర్‌ తాగి మృతి చెందిన వారిలో ఐదుగురు కూలీలు, ఇద్దరు యాచకులు, చిత్తు కాగితాలు ఏరుకుని జీవించే వ్యక్తి ఒకరు, ఒక రైతు, ఇద్దరు ఆటో డ్రైవర్లు, పండ్లవ్యాపారి ఉన్నారు. మొదట కొనగిరి రమణయ్య గురువారం రాత్రి  6.30 గం టలకు మృతి చెందాడు. అనంతరం బాబు, కడియం రమణయ్యలను వేర్వేరుగా దర్శి సీహెచ్‌సీకి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. వి శ్రాంత లస్కర్‌ దాసు, కుందా అగస్టీన్‌లు ఇంటి వద్దనే మృతి చెందారు. శుక్రవారం ఉదయానికి  అనుగొండ శ్రీను, భోగ్యం తిరుపతయ్య, గుంటక రామిరెడ్డి ఇళ్ల వద్ద నిద్రలోనే మరణించారు. చార్లెస్‌ కురిచేడులోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొం దుతూ ప్రాణాలు కోల్పోయాడు.  రాజారెడ్డి  రోడ్డు పక్కన చెట్టు కిందే కుప్పకూలా డు. సైదా వినుకొండ ప్రభుత్వ వైద్యశాలలో మృతి చెందాడు. గుంటూరుకు చెందిన మాతంగి చినసుబ్బారావు గురువారం మనుమరాలి పెళ్లికి కురిచేడు వచ్చాడు. శానిటైజర్‌ సేవించి స్వగ్రామానికి వెళ్లాడు. అక్కడ శుక్రవారం మృతి చెందాడు. 


రంగంలోకి దిగిన పోలీసులు 

 ఒకేసారి 13మంది మృత్యువాఒకరి తర్వాత ఒకరు.. శానిటైజర్‌ తాగి మృతి చెందిన త పడటంతో జిల్లా ప్రజలతోపాటు, అధికార యంత్రాంగం ఉలిక్కి పడింది. ముఖ్యమైన పోలీసు అధికారులంతా కురిచేడుకు చేరుకున్నారు. ఎస్పీ, ఇద్దరు డీఎస్పీలు, ఇద్దరు సీఐలు, దర్శి, పొదిలి సర్కిల్‌ పరిధి లోని ఎస్‌ఐలు కురిచేడులో మకాం వేశారు. శానిటైజర్లు ఏఏ కంపెనీలవి, చనిపోయిన వారు ఎక్కడ కొనుగోలు చేశారు, ఎక్కడ తాగారు అన్న విషయాలపై విచారణ చేశారు. ఉదయాన్నే మెడికల్‌ షాపులను మూసివేయించి తాళాలను స్వాధీనం చేసుకున్నారు.  మృతుల గృహాల వద్ద ఉన్న శానిటైజర్‌ బాటిళ్ల మీద ఉన్న బ్యాచ్‌ నంబరు ఆధారంగా మెడికల్‌ షాపులలో విచారణ చేశారు. 


మృతుల్లో నలుగురికి కరోనా

 శానిటైజర్‌ తాగి మృతి చెందిన 13 మందిలో నలుగురికి కరోనా ఉన్నట్లు తేలింంది. మృతదేహాలను పోస్టుమార్టం కోసం దర్శి సీహెచ్‌సీకి తరలించి అక్కడ పరీక్షలు నిర్వహించగా ఈ విషయం బయ టపడింది. నలుగురికి వైరస్‌ ఉన్నట్లు నిర్ధారణ అ య్యిందని వైద్య సిబ్బంది తెలిపారు. వారి మృతదే హాలకు పోస్టుమార్టం నిలిపివేసి,  కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చినట్లు చెప్పారు. 


బాధాకరం : కలెక్టర్‌ భాస్కర్‌

ఒంగోలు (కలెక్టరేట్‌): శానిటైజర్‌ తాగి కురి చేడులో పేదలు మృతిచెందడం బాధాకరమని కలెక్టర్‌ పోలా భాస్కర్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఘటనను దృష్టిలో ఉంచుకొని మెడికల్‌ షాపు ల్లో శానిటైజర్లను విక్రయించే సమయంలో దుకా ణాదారులు అన్నీ విచారించాలన్నారు. ఇలాంటివి భవిష్యత్‌లో జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్‌ సూచించారు. 


 ఎమ్మెల్యే వేణుగోపాల్‌  పరామర్శ

 దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌ కురిచేడు కు వచ్చి మృతదేహాలను పరిశీలించారు. వారి కు టుంబాలను ఓదార్చారు. అండగా ఉంటామని ధె ౖర్యం చెప్పారు. ముఖ్యమంత్రితో మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. అక్కడే ఉన్న ఎస్పీతో ప్రత్యేకంగా మాట్లాడారు.   

Updated Date - 2020-08-01T10:47:15+05:30 IST