స్కూబీకి సెల్యూట్
ABN , First Publish Date - 2020-10-04T17:23:43+05:30 IST
పోలీసు శాఖలో ఏడేళ్లపాటు సేవలందించిన జాగిలం (స్కూబీ) అనారోగ్యంతో..
అనారోగ్యంతో పోలీసు జాగిలం మృతి
ఒంగోలులో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు
ఒంగోలు: పోలీసు శాఖలో ఏడేళ్లపాటు సేవలందించిన జాగిలం (స్కూబీ) అనారోగ్యంతో మృతి చెందింది. దీనికి పోలీసులు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. 2012 డిసెంబరు 26న జన్మించిన స్కూబీ పది నెలలపాటు పేలుడు పదార్థాలు కనిపెట్టడంలో హైదరాబాద్లోని ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్సీ ట్రైనింగ్ అకాడమీలో శిక్షణ పొందింది. 2013 డిసెంబరులో జిల్లాకు దీన్ని కేటాయించారు. దీనికి ఏఆర్ హెడ్కానిస్టేబుల్ వై. రామిరెడ్డి హ్యాండ్లర్గా వ్యవహరిస్తున్నారు.
పోలీసు శాఖకు స్కూబీ అనేక సందర్భాల్లో ఉపయోగపడింది. వీఐపీల పర్యటనల సందర్భంగా బందోబస్తు నిర్వహణలో అమూల్యమైన సేవలు అందించింది. ఇటీవల అనారోగ్యానికి గురైన ఈ జాగిలం శనివారం మృతి చెందింది. స్కూబీ కళేబరాన్ని ప్రత్యేక వాహనంలో ఉంచి జిల్లా పోలీసు కార్యాలయం నుంచి పోలీసు శిక్షణ కేంద్రం వరకూ అంతిమయాత్ర నిర్వహించారు. అక్కడ అధికారిక లాంఛనాలతో ఖననం చేశారు. అంతిమయాత్రలో ఎస్పీ సిద్ధార్థ కౌశల్, మార్కాపురం ఓఎ్సడీ కె. చౌడేశ్వరి, ఏఆర్ డీఎస్పీ కె. రాఘవేంద్రరావు, సీఐలు వి. సూర్యనారాయణ, ఎం. భీమానాయక్, ఆర్. రాంబాబు పాల్గొన్నారు.