మంత్రి ఇలాకాలో రేషన్ మాఫియా
ABN , First Publish Date - 2020-06-07T07:46:34+05:30 IST
విద్యాశాఖ మంత్రి ఇలాకాలో రేషన్ బియ్యం భారీ రాకెట్ గుట్టురట్టయింది
లెవీ ముసుగులో అక్రమ వ్యాపారం
పేరు ట్రేడింగ్ రైస్మిల్, చేసేది రీసైక్లింగ్
వై.పాలెం కేంద్రంగా వ్యాపారం
350 టన్నుల బియ్యం స్వాధీనం
ఆత్మకూరు డీఎస్పీ ఆధ్వర్యంలో దాడులు
వైసీపీ నాయకుల రైస్మిల్లులో పట్టివేత
విలువ రూ.కోటిపైనే..
ఎర్రగొండపాలెం కేంద్రంగా రేషన్ బియ్యం రీసైక్లింగ్ జోరుగా సాగుతోంది. కర్నూలు జిల్లా ఆత్మకూరులో తీగలాగితే ఇక్కడ డొంక కదిలింది. శుక్రవారం ఆత్మకూరు చెక్పోస్టు వద్ద రెండు మినీలారీల్లో తరలిస్తున్న 152 క్వింటాళ్ల సబ్సిడీ బియ్యాన్ని డీఎస్పీ వెంకట్రావు ఆధ్వర్యంలో పోలీసులు పట్టుకున్నారు. డ్రైవర్ సమాచారం మేరకు శనివారం వేకువజామున ఎర్రగొండపాలెంలోని వెంకటసాయి రైస్ ట్రేడింగ్ మిల్లో డీఎస్పీ పర్యవేక్షణలో పోలీసులు తనిఖీ చేయగా భారీగా పేదల బియ్యం వెలుగు చూశాయి.
వాటి విలువ రూ.కోటిపైనే ఉంటుందని అంచనా. పశ్చిమ ప్రాంతంలో ఇంత భారీగా రేషన్బియ్యం వెలుగు చూడటం ఇదే ప్రథమం. స్థానిక వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో నడుస్తున్న మిల్లులో అక్రమాలు వెలుగుచూడటం చర్చనీయాంశంగా మారింది.
ఎర్రగొండపాలెం/మార్కాపురం, జూన్ 6 : విద్యాశాఖ మంత్రి ఇలాకాలో రేషన్ బియ్యం భారీ రాకెట్ గుట్టురట్టయింది. కర్నూలు జిల్లా ఆత్మకూరులో పట్టుబడిన బియ్యం మాఫియాను విచారించగా మూలాలు ఎర్రగొండపాలెంలో బయటపడ్డాయి. స్థానిక వెంకట సాయి రైస్మిల్లో ఆత్మకూరు డీఎస్పీ జె.వెంకట్రావు పర్యవేక్షణలో పోలీసులు శనివారం ఉదయం తనిఖీ చేసి పెద్ద ఎత్తున సబ్సిడీ బి య్యం నిల్వలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. కుందురి కృష్ణమూ ర్తికి చెందిన రైస్మిల్లును స్థానిక వైసీపీ నాయకులు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. మిల్లులో స్టాక్ ఉంచిన రేషన్ బియ్యాన్ని, మిల్లు గోదాములో నిల్వ ఉంచిన రీసైక్లింగ్ బియ్యాన్ని కలిపి అక్కడ 7వేల బస్తాల్లో 350 టన్నులు స్వాధీనం చేసుకున్నారు.
వీటి విలువ రూ.కోటిపైనే ఉంటుందని అధికారుల ప్రాథమిక అంచనా. రైస్మిల్లో అక్రమంగా నిల్వ ఉంచిన బియ్యం 200 టన్నులను స్థానిక ఎంఎల్ఎస్ పాయంట్కు తరలించారు. 100 టన్నుల బియ్యాన్ని రైస్మిల్ గోదాములో ఉంచి సీల్ వేశారు. ఆత్మకూరు సీఐ ప్రసాదు, ఆత్మకూరు ఎస్.ఐ నాగేంద్ర ప్రసాదు, పాములపాడు ఎస్ఐ రాజ్కుమార్ ఈ తనిఖీలలో పాల్గొ న్నారు. ఎర్రగొండపాలెం తహసీల్దారు కె. నెహ్రుబాబు, ఎన్ఫోర్సు మెంటు డీటీ రవీంద్రరెడ్డి, ఎఫ్ఐ కేశవభట్టు, ఆర్ఐ వీరయ్య, వీఆర్వోలు బియ్యం నిల్వలను స్వాధీనం చేసుకున్నారు.
ఏజెంట్ల ద్వారా పేదల బియ్యం సేకరణ
ట్రేడింగ్ రైస్మిల్లులో తవ్వేకొద్ది అక్రమాలు బయటపడుతున్నా యి. ట్రేడింగ్ వ్యాపారం కోసం నిర్మించిన రైస్మిల్లులో రూటు మార్చేసి ప్రభుత్వ ఎఫ్సీ బియ్యం కొనుగోలు చేసి ఇతర రాష్ట్రాలకు టన్నుల కొద్దీ తరలిస్తున్నారు. ఎర్రగొండపాలెం చుట్టుపక్కల మండలాలతోపాటు పొరుగు జిల్లాల్లోని రేషన్ డీలర్లు నుంచి కొంతమంది వ్యాపారులు బియ్యం కొనుగోలు చేసి రూ.17 వరకూ వెంకటసాయి మిల్కు విక్రయిస్తున్నారు. అక్ర మ బియ్యం వ్యాపారం చేసే ఏజెంట్లు 50 నుంచి 100 బ్యాగ్లు కాగానే మినీలారీల్లో రాత్రి పూట ఎర్రగొండపాలెంకు చేరవేస్తున్నట్లు తెలిసింది. కొనుగోలు చేసిన బియ్యాన్ని పాలిష్ అనం తరం పాలిథిన్ గోతాల్లోకి మార్చి 50 కేజీ ల వంతున ప్యాకింగ్ చేసి మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు చేరవేస్తున్నా రని పోలీసులకు వచ్చిన సమాచా రం. రీసైక్లింగ్ చేసిన తర్వాత కేజీ రూ.27 వంతున విక్రయిస్తున్నా రు. లాక్డౌన్ నేపఽథ్యంలో కార్డు దారులకు నాలుగు విడతలు ఇచ్చిన బియ్యం అక్రమమా ర్గంలో రైస్మిల్లుకు చేరడం తో 350 టన్నులకుపైగా ని ల్వలు ఉన్నాయి.
350 టన్నులు స్వాధీనం చేసుకున్నాం
ఎర్రగొండపాలెంలోని రైసు మిల్లులో 350 టన్నుల బియ్యం స్వాధీనం చేసుకున్నాం. లూజుగా ఉన్న బియ్యాన్ని సంచులకు నింపితే మరో 20టన్నులు పెరుగుతాయి. స్టాక్ కొంత ఎంఎల్ఎస్ పాయింట్కు పంపాం. మిగతాది మిల్లులోనే ఉంచి సీజ్ చేశాం. ప్రభుత్వ సబ్సిడీ బియ్యం ఇతర ప్రాంతాల నుంచి సేకరించి మిల్లు యజమానులు బయటి మార్కెట్లో అమ్ముతున్నారు. బియ్యం ఎంత విలువ అనేది పౌరసరఫరాల సంస్థ అధికారులు నిర్ణయిస్తారు. రైస్మిల్లు రికార్డులు స్వాధీనం చేసుకొన్నాం. యజమాని కృష్ణమూర్తిపై కేసు నమోదు చేశాం. దీని వెనుక ఎంత మంది ఉన్నారన్నది దర్యాప్తులో తేలుతుంది.
- వెంకట్రావు, ఆత్మకూరు డీఎస్పీ