బాలలతో పని చేయిస్తే కఠిన చర్యలు
ABN , First Publish Date - 2020-10-29T10:12:41+05:30 IST
బాలలను పనిలో పెట్టుకొని వారి తో చాకిరీ చేయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ సిద్ధార్థ కౌశల్ హెచ్చరించారు.
ఎస్పీ సిద్ధార్థ కౌశల్ హెచ్చరిక
జిల్లావ్యాప్తంగా ఆపరేషన్ ముస్కాన్
739 మంది బాలకార్మికుల గుర్తింపు
ఒంగోలులో సొమ్మసిల్లిన బాలుడు
ఒంగోలు (క్రైం), అక్టోబరు 28 : బాలలను పనిలో పెట్టుకొని వారి తో చాకిరీ చేయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ సిద్ధార్థ కౌశల్ హెచ్చరించారు. అలా చేయడం చట్టరీత్యా నేరమని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా పోలీసులు ప్రభుత్వ, ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థల ప్రతి నిధులతో కలిసి బుధవారం ఆపరేషన్ ముస్కాన్ నిర్వహించారు. ఈ సందర్భంగా 239 మంది బాల కార్మికులు, వీధి బాలలను గుర్తించారు. వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. బాలలతో పని చేయించు కుంటున్న దుకాణాల యజమానులకు హెచ్చరికలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఒంగోలులోని రైల్వే స్టేషన్ వద్ద పోలీసులు గుర్తించిన వీధి బాలలకు ఎస్పీ కౌన్సెలింగ్ ఇచ్చారు. వారికి దుస్తులు, బిస్కెట్లు అందజేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా 739 మంది వీధి బాలలు, బాల కార్మికులను గుర్తించి విముక్తి కల్పిం చామని చెప్పారు. ఆయన వెంట ఒంగోలు డీఎస్పీ ప్రసాద్, సీఐలు వి. సూర్యనారాయణ, రాంబాబు, సీతారామయ్య, శివరామకృష్ణారెడ్డి, శ్రీనివాసరావు, సుబ్బారావు, స్త్రీ,శిశు సంక్షేమ శాఖ సిబ్బంది ఉన్నారు.
ఒంగోలు తాలూకా స్టేషన్ వద్ద తల్లిదండ్రుల నిరసన
బాల కార్మికులను గుర్తింపు సమయంలో ఒంగోలులో అనేక అపశ్రు తులు చోటు చేసుకున్నాయి. స్థానిక రైల్వేస్టేషన్ వద్ద ఒంగోలు సబ్డివిజన్ పరిధిలోని గుర్తించిన వీధి బాలలకు ఎస్పీ సిద్ధార్థ కౌశల్ అవ గాహన కల్పిస్తున్న సమయంలో కొత్తపట్నంనకు చెందిన బాలుడు సొ మ్మసిల్లి పడిపోయాడు. ఎస్బీ ఇన్స్పెక్టర్ సూర్యనారాయణ ఆ బాలు డిని పోలీసు వాహనం ఎక్కించి ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యసేవలు అందించిన తర్వాత కోలుకున్నాడు. పోలీసులు తమను సుమారు మూడు గంటలు ఎండలో నిలబెట్టారని, కనీసం మంచినీరు అడిగినా ఇవ్వకపోవడంతో ఆ బాలుడు సొమ్మసిల్లి పడిపోయాడ ని అక్కడ ఉన్న బాలబాలికలు తెలిపారు. తాలుకా పోలీ్సస్టేషన్ వద్ద పలువురు పిల్లల తల్లిదండ్రులు నిరసన తెలిపారు. తమ సొంత దుకాణాల్లో ఉన్న వారిని పోలీసు తీసుసురావడం ఏంటని ప్రశ్నించారు. అంతేకాకుండా పాల ప్యాకెట్ తెస్తున్న తన కుమారుడిని పోలీసులు పట్టుకొచ్చారని ఓ బాలుడి తల్లిదండ్రులు వాపోయారు. పోలీసు చర్యలను నిరసించారు. కరోనా సమయంలో పిల్లలు బయటకు వెళ్ల కుండా తమ వెంట దుకాణాలకు తీసుకువస్తే అక్కడ పని చేస్తున్నట్లు నమోదు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.