ముఖం చాటేసిన ఆర్టీసీ బస్సులు

ABN , First Publish Date - 2020-12-11T05:57:37+05:30 IST

పల్లెవెలుగు బస్సులు పల్లెల ముఖం చూడడం లేదు. గ్రామీణ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుండడమే కాక ఆటోలలో ప్రమాదకర ప్రయాణాలు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.

ముఖం చాటేసిన ఆర్టీసీ బస్సులు


కంభం, డిసెంబరు 10 : పల్లెవెలుగు బస్సులు పల్లెల ముఖం చూడడం లేదు. గ్రామీణ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుండడమే కాక ఆటోలలో ప్రమాదకర ప్రయాణాలు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే 8 మాసాల క్రితం కరోనా ప్రభావంతో గిద్దలూరు డిపో నుంచి కంభం కేంద్రంగా అర్థవీడు, బేస్తవారపేట మండలాలకు ప్రతిరోజు 10 ట్రిప్పులకు తగ్గకుండా పల్లెవెలుగు బస్సులు తిరిగేవి. లాక్‌డౌన్‌ విధించడంతో బస్సులు నిలిపివేశారు. ప్రస్తుతం నెల రోజుల నుంచి కంభం ఆర్టీసి బస్టాండ్‌ నుంచి బేస్తవారపేట మండలం కోనపల్లె లోయకు, అర్థవీడు మండలం అచ్చంపేట, వెలగలపాయ లోయలకు బస్సులను పునరుద్దరించారు. అయితే ఈ బస్సులు 1, 2 ట్రిప్పులు తిరుగుతుండడంతో ఆయా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాలారూట్లలో బస్సులు తిప్పకపోవడంతో నిత్యం ప్రజలు పనుల కోసం కంభం, బేస్తవారపేటలకు రాకపోకలకు ఆటోలను ఆశ్రయిస్తున్నారు. సాయంత్రం 4గంటల తరువాత బస్సులు లేకపోవడంతో ప్రజలు, విద్యార్థులు ఆటోలలో అధిక చార్జీలు వెచ్చించి మరీ వెనుక వేలాడుతూ భద్రతలేని ప్రయాణం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి బస్సు సర్వీసులు గతంలో లాగా పునరుద్దరించాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - 2020-12-11T05:57:37+05:30 IST