ఆశాజనకంగా మత్స్య సంపద
ABN , First Publish Date - 2020-07-10T10:48:17+05:30 IST
సముద్రంలో వేట ఆశాజనకంగా సాగుతోంది. మత్స్య కారుల వలకు చేపలు, రొయ్యలు సంవృద్ధిగా దొరుకుతన్నాయి.

కొనుగోలు కేంద్రంలో ఇతరులకు నో ఎంట్రీ
కరోనా నేపథ్యంలో మత్స్యకారుల ఆంక్షలు
పర్యవేక్షిస్తున్న ఈపురుపాలెం స్టేషన్ పోలీసులు
చీరాల, జూలై 9: సముద్రంలో వేట ఆశాజనకంగా సాగుతోంది. మత్స్య కారుల వలకు చేపలు, రొయ్యలు సంవృద్ధిగా దొరుకుతన్నాయి. ఒక్కో బోటు కు రూ.15 వేల నుంచి రూ.25 వేల మధ్య మత్స్య సంపద దొరుకుతోంది. సరాసరిన రోజుకు రూ.7 లక్షల నుంచి రూ.9 లక్షల మేర లావాదేవీలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దొరికిన మత్స్యసంపదను విక్రయించే ఫిష్ ల్యాండింగ్ సెంటర్లోకి ఇతర ప్రాంతాల నుంచి వచ్చే కొనుగోలుదారులకు అనుమతి లేకుండా స్థానికులు నిర్ణయం తీసుకున్నారు.
ఇతర ప్రాంతాల నుంచి వచ్చే కొనుగోలుదారులతో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని ఇటీవల స్ధానికులు ఆందోళన వ్యక్తం చేశారు.ఈ క్రమంలో ఇతర ప్రాంతాల నుంచి కొనుగోలుదారులకు అనుమతి లేదని ప్రకటించారు. ఈపురు పాలెం పోలీస్స్టేషన్ పోలీసులు, గ్రామవలంటీర్లు మత్స్యసంపదను విక్రయించే ఫిష్ల్యాండింగ్ సెంటర్ చుట్టూ వలలతో దడి ఏర్పాటుచేశారు. దీంతోపాటు ప్రతిరోజు ఉదయం వేళల్లో చేపల విక్రయాలు జరిగేవరకు స్వయంగా పర్య వేక్షిస్తున్నారు. చీరాల చుట్టుపక్కల ప్రాంతాల వారు కొనుగోలుకు వెళ్లినా ఫిష్ల్యాం డింగ్ సెంటర్లోకి మాత్రం అనుమతించటం లేదు. ఫిష్ ల్యాండింగ్ సెంటర్ వెలుపల రిటైల్ విక్రయదారుల వద్ద కొనుగోలు చేసేవిధంగా అనుమతి ఇచ్చారు.