వంటగ్యాస్పై వడ్డన
ABN , First Publish Date - 2020-12-17T06:12:24+05:30 IST
వినియోగదారులకు సబ్సిడీ వంటగ్యాస్ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. పక్షంరోజుల్లోనే 14.2 కిలోల సిలిండర్ రూ.100 పెరిగింది.
ఒంగోలు (కలెక్టరేట్), డిసెంబరు 16 : వినియోగదారులకు సబ్సిడీ వంటగ్యాస్ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. పక్షంరోజుల్లోనే 14.2 కిలోల సిలిండర్ రూ.100 పెరిగింది. గత నెలాఖరు వరకూ రూ.639 ఉండగా బుధవారం ఆ ధర రూ.739కి పెరిగింది. డిసెంబర్ మొదటి వారంలో రూ.50, బుధవారం మరో రూ.50 పెరిగింది. జిల్లావ్యాప్తంగా 64 గ్యాస్ ఏజెన్సీల పరిధిలో 8.70లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా సరాసరిన రోజుకు 30వేల సిలిండర్ల వరకు డొమెస్టిక్ వినియోగదారులు తీసుకుంటుంటారు. ఒక్కో సిలిండర్పై రూ.100 వంతున రోజుకు రూ.30లక్షల చొప్పున వినియోగదారులపై నెలకు రూ.9కోట్ల వరకూ భారం పడుతోంది. 3 లక్షల మందికి డబుల్ సిలిండర్ కనెక్షన్లు ఉండగా మిగిలిన వారికి సింగిల్ సిలిండర్ కనెక్షన్లు ఉన్నాయి.
కష్టకాలంలో పెరుగుదల
కరోనా మహమ్మారి దెబ్బ నుంచి ప్రజానీకం ఇంకా కోలుకోలేదు. ఏడాదిగా సరైనా పనులు లేక, జీతాలు లేక అల్లాడుతున్నారు. గత రెండు నెలల నుంచి సడలింపులు ఇవ్వడంతో ఇప్పుడిప్పుడే ఆ విపత్కర పరిస్థితి నుంచి బయటపడుతున్నారు. ఆ సమయంలోనే కేంద్రం 15రోజుల వ్యవధిలోనే రెండుసార్లు గ్యాస్ ధరలు పెంచి సామాన్య ప్రజానీకంపై భారం మోపింది. దీంతో జనం గ్యాస్ అంటేనే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.