ఇప్పుడెందుకు ఇలా..!
ABN , First Publish Date - 2020-05-20T11:35:26+05:30 IST
జిల్లాలో మంగళవారం కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాలేదు. కోయంబేడు లింకుతో పాజిటివ్ వచ్చిన
క్వారంటైన్ అక్కడ.. వైద్యులు ఇక్కడ
జిల్లాలోని క్వారంటైన్లలో సౌకర్యాలు కరువు
పాజిటివ్ రోగులు కూడా అక్కడే
ఈలోగా ఇతరులకు వ్యాపించే అవకాశం
మంగళవారం నమోదు కాని కేసులు
ఒంగోలు నగరం, మే 19: జిల్లాలో మంగళవారం కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాలేదు. కోయంబేడు లింకుతో పాజిటివ్ వచ్చిన ముగ్గురు నుంచి ఇతరులకు వ్యాపించి ఉండవచ్చన్న అనుమానంతో వారిని కూడా తెచ్చి పరీక్ష లు నిర్వహించారు. అయితే వీరందరికీ నెగటివ్ రిపోర్టులే వచ్చాయి. దీంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. కాగా ఇంకా కోయంబేడు నుంచి వచ్చిన వారి ఫలితాలు అన్నీ వెలువడలేదు. వీరిలో కొందరు పాజిటివ్ వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.
జిల్లా కేంద్రంలోని ట్రిపుల్ ఐటీ భవనం, రైజ్ ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రస్తు తం కొవిడ్ కేర్ సెంటర్లను నిర్వహిస్తున్నారు. వీటితోపాటు జిల్లాలోని అన్ని మండలాల్లో కమ్యూనిటీ క్వారంటైన్లు నడుస్తున్నాయి. ఇవికాక మరో 29 క్వా రంటైన్ కేంద్రాలను నిర్వహిస్తున్నారు. ట్రూనాట్పై పాజిటివ్గా తేలిన వారిని ట్రిపుల్ ఐటీ, రైజ్ కళాశాలల్లోని కొవిడ్ కేర్ సెంటర్లలో ఉంచుతున్నారు. వీరిని అక్కడ ఉండే ఇతరులతోనే ఉంచేస్తున్నారు. ఆ తర్వాత వీఆర్డీఎల్పై నిర్వ హిస్తున్న పరీక్షల్లో కూడా వీరికి పాజిటివ్గానే నిర్ధారణ అవుతోంది. ఈలోగా పాజిటివ్ రోగి నుంచి క్వారంటైన్లో ఉండే ఇతరులకు కూడా ఈ వైరస్ సోకే అవకాశం ఉంటుంది. దీంతో ట్రిపుల్ ఐటీ, రైజ్ కళాశాలల్లో ఉంటున్న ఇతరులు భయపడుతున్నారు.
ఢిల్లీ నుంచి వచ్చిన వారిని వెంటనే ఐసోలేషన్కు తరలింపుతో కట్టడి
జిల్లాలో ఇప్పటివరకు ఢిల్లీకి పోయి వచ్చిన వారి ద్వారా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మర్కజ్ నుంచి వచ్చిన వారికి కరోనా వైరస్ ఉందనే ప్రచారం జరగ్గానే జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. వారందరినీ రిమ్స్లోని క్వారంటైన్కు తరలించి ఇతరులకు దూరంగా ఉంచేశారు. వీరిలో పాజిటివ్గా నిర్ధారణ అయిన వారికి చికిత్స అందించి పూర్తిగా కోలుకున్నాక డిశ్చార్జి చేశారు. ఒకవిధంగా చెప్పాలంటే అందరినీ పాజిటివ్గానే భావించి వారి నుంచి ఇతరు లకు వైరస్ సోకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. కరోనా నిర్ధారణ పరీక్షలు ఆలస్యంగా వస్తున్నా.. ముందుగానే వారిని క్వారంటైన్లో వేరుగా ఉంచి చికిత్స అందించారు. వీరి ద్వారా ఇతరులకు సోకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. ఇలా చేయటం వలన ఢిల్లీ నుంచి వచ్చిన వారి ద్వారా ఇంకా కేసులు పెరగకుండా ముందస్తు చర్యలు చేపట్టి కట్టడి చేయగలిగారు.
కోయంబేడు కేసులపై నిర్లక్ష్యం
జిల్లా యంత్రాంగం కోయంబేడు నుంచి వచ్చిన వారి నుంచి ఇతరులకు సోకుండా జాగ్రత్తలు తీసుకోవటంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారంటూ విమర్శలు న్నాయి. ఉదాహరణకు కొత్తపట్నం మండలం రాజుపాలెంలో నమోదైన రెండు కేసుల విషయంలో ఇలాగే జరిగింది. వారిని ఒకరోజు కొత్తపట్నంలోని ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన క్వారంటైన్లో ఉంచారు. వీరిని అక్కడ ఉన్న అందరితో పాటే కలిపే ఉంచారు. ట్రూనాట్పై నిర్ధారణ జరిగిన తర్వాత కూడా ఒంగోలులోని ట్రిపుల్ఐటీలో కూడా అందరితో కలిపే ఉంచారు. తీరా వీఆర్ డీఎల్ మీద నిర్ధారణ జరిగాక రిమ్స్కు తరలించారు. కమ్మపాలెం కేసు విష యంలో కూడా ఇదే జరిగింది. పైగా ఒంగోలులో ఏర్పాటుచేసిన ట్రిపుల్ఐటీ, రైజ్ కేంద్రాల్లో వైద్యసిబ్బంది కూడా ఉండటం లేదు. ట్రూనాట్పై నిర్ధారణ జరిగిన వారిని, అనుమానిత లక్షణాలు ఉన్నవారిని ఇక్కడ తెచ్చి ఉంచు తున్నారు. వీరికి వైద్య సహాయం అందించేందుకు వైద్యులు అందుబాటులో ఉండటం లేదు. వారంతో రిమ్స్లో ఉండిపోతున్నారు. వైద్యులు లేనిచోట కరోనా అనుమానితులు ఉంటున్నారు.