పేదలకు ఊరట...
ABN , First Publish Date - 2020-03-29T10:38:33+05:30 IST
జిల్లాలో రేషన్షాపుల ద్వారా ఆదివారం నుంచి నిత్యావసర సరుకులు పంపిణీ చేసేందుకు పౌరసరఫరాల శాఖ
నేటి నుంచి రేషన్ సరుకులు పంపిణీ
కార్డుదారుని బదులు ప్రభుత్వ ఉద్యోగి బయోమెట్రిక్
బియ్యం, కందిపప్పు ఉచితం
చక్కెరకు మాత్రం నగదే..
ఒంగోలు(కలెక్టరేట్), మార్చి 28 : జిల్లాలో రేషన్షాపుల ద్వారా ఆదివారం నుంచి నిత్యావసర సరుకులు పంపిణీ చేసేందుకు పౌరసరఫరాల శాఖ అధికారులు ఏర్పాట్లుచేశారు. జిల్లావ్యాప్తంగా ఉన్న 2,151 రేషన్షాపులకు ఇప్పటికే బియ్యం, కందిపప్పు, చక్కెరను సరఫరా చేశారు. కరోనా వైరస్ కారణంగా లాక్డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రేషన్షాపుల ద్వారా నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్నట్లు రాష్ట్రప్రభుత్వం ప్రకటించింది. ఈనెల 29 నుంచి రేషన్షాపుల ద్వారా కార్డుదారులకు పంపిణీ చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించడంతో అందుకు అనుగుణంగా జిల్లాలో అధికారులు ఏర్పాట్లు చేశారు.
రేషన్షాపునకు ఒక ప్రభుత్వ ఉద్యోగి
రేషన్షాపుల వద్ద పర్యవేక్షణకు ఒక ప్రభుత్వ ఉద్యోగిని కేటాయించారు. కార్డుదారులు బయోమెట్రిక్ విధానంతో రేషన్ సరుకులు తీసుకోవాల్సి ఉంది. కరోనా నేపథ్యంలో కార్డుదారులు బయోమెట్రిక్ వేయకుండా ఆ స్థానంలో ప్రభుత్వ ఉద్యోగి బయోమెట్రిక్ వేసి సరుకులను ఇచ్చేందుకు ఏర్పాటుచేశారు. జిల్లాలోని రేషన్షాపుల్లో ఉన్న బయోమెట్రిక్కు సచివాలయంలో పనిచేసే ఉద్యోగి లేదా వీఆర్వో, అతను కూడా లేనిపక్షంలో వలంటీర్ వేలిముద్రలను బయోమెట్రిక్లో వినియోగించనున్నారు. ఆ రేషన్షాపు వద్ద ఉండే ప్రభుత్వ ఉద్యోగి కార్డుదారుని రేషన్కార్డును పరిశీలించిన అనంతరం ఆ కార్డు స్థానంలో ప్రభుత్వ ఉద్యోగి వేలిముద్ర వేసి కార్డుదారునికి నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తారు.
బియ్యం, కందిపప్పు ఉచితం
కరోనా వైరస్ ప్రభావంతో పేదలు ఉపాధి కోల్పోవడంతో ప్రభుత్వం రేషన్షాపుల ద్వారా ఇచ్చే బియ్యం, కందిపప్పును ఉచితంగా అందజేస్తారు. కార్డులో ఎంతమంది కుటుంబసభ్యులు ఉంటే ఒక్కొక్కరికి ఐదు కిలోల చొప్పున బియ్యం, కిలో కందిపప్పును కార్డుదారులకు అందజేస్తారు. చెక్కర(పంచదార)కు మాత్రం అరకిలో మాత్రమే ఇస్తారు. అందుకు సంబంధించి కార్డుదారుడు నగదు చెల్లించాల్సి ఉంటుంది.