వెలిసిన వర్షం.. వెలుగు చూస్తున్న నష్టం
ABN , First Publish Date - 2020-11-19T05:46:52+05:30 IST
కందుకూరు ప్రాంతంలో వారం రోజులుగా కురిసిన వర్షాలు రైతులను కోలుకోలేని దెబ్బతీశాయి. బుధవారం వర్షం వెలి సి ఎండ రావటంతో పంట నష్టాలు వెలుగు చూస్తున్నాయి.
![వెలిసిన వర్షం.. వెలుగు చూస్తున్న నష్టం](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
మిరప, మినుము పైర్లకు భారీ దెబ్బ
పైర్లు ఉరకెత్తడం, కుళ్లిపోతుండడంతో రైతుల లబోదిబో
కందుకూరు ప్రాంతంలో నీట మునిగిన పంటలు
కందుకూరు, నవంబరు 18 : కందుకూరు ప్రాంతంలో వారం రోజులుగా కురిసిన వర్షాలు రైతులను కోలుకోలేని దెబ్బతీశాయి. బుధవారం వర్షం వెలి సి ఎండ రావటంతో పంట నష్టాలు వెలుగు చూస్తున్నాయి. మిరప తోటలు ఉరకెత్తి నిలువునా ఎండిపోతుండగా, మినుము పైరు పడిపోయి కుళ్లిపోతోం ది. వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలో ఈ ఏడాది 3వేల ఎకరాలకు పైగా మి రప సాగవగా రమారమి వెయ్యిఎకరాలలో పైరు ఉరకెత్తినట్లు ప్రాథమిక అంచనా. మరో రెండు రోజులు గడిస్తే నష్టం అంచనాలు ఇంకా పెరిగే అవకాశముందని రైతులు చెబుతున్నారు. ఇప్పటికే రెండు నెలల పైరు కాగా పూత, పిందె దశలో ఉన్న మిరప చెట్లు నిలువునా ఎండిపోతున్నాయి. ఈ ఏడాది మిరప మొక్క రెండున్నర, మూడు రూపాయలు పెట్టి కొనడం, ఇప్పటికే అధికశాతం ఎరువులు వేయటం, పురుగుమందులు స్ర్పే చేయటం పూర్తయిన దశలో మిరపచెట్లు ఉరకెత్తటంతో పెట్టుబడి రూపంలోనే ఎకరానికి లక్ష రూపాయల వరకు నష్టం వాటిల్లిందని రైతులు కన్నీరు పెడుతున్నారు.
మినుముకీ అపారనష్టం
మినుముకీ అపారనష్టం వాటిల్లింది. ఈ ప్రాంతంలో రమారమి 15వేల ఎకరాలకుపైగా విస్తీర్ణంలో మినుము సాగవగా, అందులో 10వేల ఎకరాలకు పైగా వర్షంతో నష్టం వాటిల్లింది. అధికశాతం మినుము ప్రస్తుతం కాయ దశ లో ఉండగా కొంతమేర ముదురు కాయలు పక్వానికి వచ్చాయి. ఈ దశలో కురిసిన వర్షంతో పూత, పిందె రాలిపోవటమే గాక ముదురు కాయలు పగిలి గింజలు రాలి పొలంలోనే మొలకలు వస్తున్నాయి. దీనికి తో డు పండాకు తెగులు సోకటం, ఏపుగా పెరిగిన మినుము పడిపోయి కుళ్లిపోతుండటంతో ఉన్న కొద్దిపాటి కాయలు కూడా పనికిరాకుండా పోయే పరిస్థితి ఏర్పడింది.