నేటి నుంచి ఎంసెట్ అడ్మిషన్ల కౌన్సెలింగ్
ABN , First Publish Date - 2020-10-23T11:01:42+05:30 IST
ప్రభుత్వ , ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల్లో బీటెక్ ,ఫార్మశీ కోర్సుల్లో 2020-21 విద్యాసంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించిన ..
27 వరకు ఆన్లైన్లో సర్టిఫికెట్ల పరిశీలన
ఒంగోలువిద్య, అక్టోబరు 22 : ప్రభుత్వ , ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల్లో బీటెక్ ,ఫార్మశీ కోర్సుల్లో 2020-21 విద్యాసంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ ఎంఎసెట్ - 2020 అడ్మిషన్ల కౌన్సెలింగ్ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన ఆన్లైన్లోనే జరగనుంది. వెబ్ కౌన్సెలింగ్ విధానంలో ఆన్లైన్లో విద్యార్థులకు సీట్ల కేటాయింపు చేస్తారు. ఆన్లైన్లో సర్టిఫికెట్ల పరిశీలనకు ప్రాసెసింగ్ ఫీజుగా ఓసీ,బీసీ విద్యార్థులు రూ. 1200, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.600 క్రెడిట్ లేదా డెబిట్ కార్డులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించాలి. 1 నుంచి చివరి ర్యాంకు వరకు విద్యార్థులు ఈనెల 23 నుంచే ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి ఆన్లైన్లో సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరుకావాలి.
సర్టిఫికెట్ల పరిశీలనకు సమీపంలోని హెల్ప్లైన్ సెంటర్కు వెళ్లమని మెసేజ్లు వస్తే వారు మాత్రమే స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్లో సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరు కావాలని ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు తెలిపారు. ఈనెల 23న 1 నుంచి 20వేల ర్యాంకు వరకు , 24న 2001 నుంచి 50వేల ర్యాంకు వరకు, 25న 50,001 నుంచి 80వేల ర్యాంకు వరకు , 26 న 80,001 నుంచి 1,10,000 ర్యాంకు వరకు ,27న 1,10,01 నుంచి చివరి ర్యాంకు వరకు విద్యార్థులు సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరు కావాలని ఆయన తెలిపారు. పీహెచ్, స్పోర్టుఅండ్ గేమ్స్, ఎన్సీసీ , ఆంగ్లో ఇండియన్ అభ్యర్థులు విజయవాడ బెంజిసర్కిల్లోని ప్రభుత్వ పాలిటెక్నిక్లో సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరు కావాల్సి ఉంది.
కావాల్సిన సర్టిఫికెట్లు ఇవీ..
సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరయ్యే విద్యార్థులు తమతోపాటు ఎంసెట్ ర్యాంకు కార్డు, హాల్టిక్కెట్ ,ఇంటర్మీడియట్ మార్కుల జాబితా, పదోతరగతి మార్కులు జాబితా, టీసీ, 6 నుంచి ఇంటర్మీడియట్ వరకు స్టడీసర్టిఫికెట్ , ఈడబ్ల్యూఎస్ కోటాలో ప్రవేశంపొందగోరువారు 2020-21 సంవత్సరానికి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు కుల ధ్రువీకరణ పత్రాలు తీసుకురావాలి. ఫీజు మినహాయింపు కోరేవారు 2017 జనవరి 1 తరువాత ఆదాయ ధ్రువీకరణ పత్రం లేదా తెల్లరేషన్కార్డు తీసుకురావాలి. ఎంసెట్ సర్టిఫికెట్ల పరిశీలనకు సంబంధించి స్థానిక ప్రభుత్వపాలిటెక్నిక్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు తెలిపారు.