ఓ ప్రజాప్రతినిధి మనవడికి కరోనా.. ఆ ఇంట్లో ఇద్దరు పనివాళ్లకు కూడా..
ABN , First Publish Date - 2020-06-26T20:51:54+05:30 IST
కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో నగర పంచాయతీ పరిధిలో మరోసారి లాక్డౌన్ నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. పట్టణంలోని 3 కుళాయిల సమీపంలో ఉం టున్న మహిళకు పాజిటివ్ రావడంతో
![ఓ ప్రజాప్రతినిధి మనవడికి కరోనా.. ఆ ఇంట్లో ఇద్దరు పనివాళ్లకు కూడా..](https://media.andhrajyothy.com/appimg/galleries/2020062603193837/06262020152140n32.jpg)
గిద్దలూరు, కందుకూరులో నేటి నుంచి లాక్డౌన్
గిద్దలూరు టౌన్(ప్రకాశం) : కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో నగర పంచాయతీ పరిధిలో మరోసారి లాక్డౌన్ నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. పట్టణంలోని 3 కుళాయిల సమీపంలో ఉం టున్న మహిళకు పాజిటివ్ రావడంతో ఆ ప్రాంతాన్ని రెడ్జోన్గా ప్రకటించారు. తాజాగా విదేశాల నుంచి వచ్చిన ఓ యువకుడికి పాజిటివ్ రావడం, అతడిని తండ్రి కలవడంతో ఆందోళన మొదలైంది. తాజాగా ఓ ప్రజాప్రతినిధి మనవడికి కరోనా రావడం, ఆ ఇంటిలోని ఇద్దరు పని మనుషులకు పాజిటివ్ రావడంతో అటు నాయకుల్లో, ప్రజల్లో అలజడి రేగింది. ఈ నేపథ్యంలో మళ్లీ లాక్డౌన్ విధించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. బుధవారం అర్ధరాత్రి వరకు, గురువారం డీఎ్ఫవో, స్పెషల్ ఆఫీసర్ సతీష్ ఆధ్వర్యంలో అధికారుల సమీక్షలో సీఐ సుధాకర్రావు, మున్సిపల్ కమిషనర్ కె.హేమావతి, తహసీల్దార్ విద్యాసాగరుడు, ఎంపీడీవో రంగనాయకులతోపాటు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే శుక్రవారం నుంచి లాక్డౌన్ ప్రకటించేందుకు కసరత్తు పూర్తి చేశారు.
కందుకూరులో మాస్క్ల పేరుతో పోలీసుల జరిమానాలపై విమర్శలు
కందుకూరు పట్టణం, పరిసర గ్రామాలలో కరోనా మహమ్మారి విచ్చలవిడిగా వ్యాపిస్తున్న తరుణంలో శుక్రవారం నుంచి మరో విడత లాక్డౌన్ అమలుకానుంది. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు కేవలం నిత్యావసరాలకు సంబంధించిన దుకాణాలు మాత్రమే తెరవనున్నారు. కట్టుదిట్టంగా లాక్డౌన్ అమలు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటికే పలు ప్రాంతాలు కంటైన్మెంట్లోగా ఉండగా మిగిలిన ప్రాంతాలలో కూడా లాక్డౌన్ ద్వారా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. వైరస్ విస్తరణకు అడ్డుకట్ట వేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి సూచనతో అధికారులు లాక్డౌన్కి సిద్ధపడ్డారు. మాస్క్ లేకుండా తిరిగితే జరిగే నష్టంపై ప్రజల్లో అవగాహన కల్పించటంతో పాటు వారిలో ఒక విధమైన భయం కలిగించాలని ప్రభుత్వం మాస్క్ లేని వారికి జరిమానాలు విధించాలని నిర్ధేశించింది. ఇదే అదనుగా ఇటు పోలీసులు, అటు మున్సిపాలిటీ సిబ్బంది కూడా చలానాలు రాసేందుకు పోటీలు పడుతున్నారు తప్ప ప్రజల్లో అవగాహన కల్పించాలన్న స్పృహ లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. చేతి రుమాలు కట్టుకుని వెళ్తున్నా పోలీసులు బలవంతంగా ఆపి చలానాలు రాస్తున్నారు.