రాష్ట్ర స్థాయి పోటీల్లో కడప జిల్లా ఎడ్ల సత్తా
ABN , First Publish Date - 2020-03-13T10:55:40+05:30 IST
నరవ గ్రామంలోని లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహించిన రాష్ట్ర స్థాయి బండలాగుడు పోటీలలో
గిద్దలూరు టౌన్, మార్చి 12 : నరవ గ్రామంలోని లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహించిన రాష్ట్ర స్థాయి బండలాగుడు పోటీలలో కడప జిల్లా ఎడ్లు సత్తా చాటాయి. కడప జిల్లా పాయనపల్లి గ్రామానికి చెందిన కందుల రామకృష్ణారెడ్డి ఎడ్లు 4,200 అడుగుల దూరం బండను లాగి మొదటి బహుమతి రూ. 60వేలు సొంతం చేసుకున్నాయి. రెండో బహుమతిని గిద్దలూరు మండలం బురుజుపల్లె గ్రామానికి చెందిన యరమల సాహిత్రెడ్డి ఎడ్లు 3,922 అడుగుల దూరం బండను లాగి రూ.40వేలను గెలుచుకున్నాయి.
మూడవ బహుమతిని కడప జిల్లా కాశినాయన మండలం అనువారిపల్లి గ్రామానికి చెందిన శీలం జగన్మోహన్రెడ్డి ఎడ్లు 3,900 అడుగుల దూరం బండను లాగి రూ.25వేలను గెలుచుకున్నాయి. నాల్గవ బహుమతిని పెద్దారవీడు మండలం కంభంపాడు గ్రామానికి చెందిన బండ్ల భరత్ ఎడ్లు 3,813 అడుగుల దూరం బండను లాగి రూ. 15వేలు గెలుచుకున్నాయి. ఐదవ బహుమతిని మార్కాపురంకు చెందిన ఆకుల శ్రీనివాసులు ఎడ్లు 3,300 అడుగుల దూరం లాగి రూ. 10వేలు గెలుచుకున్నాయి. పోటీలు నువ్వా, నేనా అన్నట్లుగా సాగాయి. బండలాగుడు పోటీలను వివిధ ప్రాంతాల నుంచి రైతులు, పశుపోషకులు తిలకించారు. గెలుపొందిన ఎడ్ల యజమానులకు దేవస్థాన కమిటీ సభ్యులు బహుమతులు అందజేశారు.