అమ్మఒడి పేరు చెప్పి.. ఎన్రోల్మెంట్ అంటూ.. ప్రైవేటు పాఠశాలల దోపిడీ
ABN , First Publish Date - 2020-12-19T04:47:23+05:30 IST
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అమ్మఒడి పథకం ప్రైవేట్ పాఠశాలలకు వరంగా మారింది. సాధారణంగా ప్రైవేట్ యాజమాన్యం అధిక ఫీజులు వసూలు చేసి సొమ్ము దండుకుంటున్న విషయం తెలిసిందే. గతేడాది కరోనా వలన పాఠశాలల నిర్వహణ జరగలేదు. దీంతో విద్యార్థులు ఇంటివద్దే ఉన్నారు.
గత ఏడాది ఫీజులు వసూలు చేస్తున్న వైనం
దర్శి, డిసెంబరు 18 : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అమ్మఒడి పథకం ప్రైవేట్ పాఠశాలలకు వరంగా మారింది. సాధారణంగా ప్రైవేట్ యాజమాన్యం అధిక ఫీజులు వసూలు చేసి సొమ్ము దండుకుంటున్న విషయం తెలిసిందే. గతేడాది కరోనా వలన పాఠశాలల నిర్వహణ జరగలేదు. దీంతో విద్యార్థులు ఇంటివద్దే ఉన్నారు. ఈ నేపథ్యంలో అమ్మఒడి పథకం ద్వారా తల్లులకు నగ దు జమ అవుతుందని చెప్పి విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేస్తున్నారు.
గతేడాది చదివిన విద్యార్థులు ఈ ఏడాది యథాతథంగాపై తరగతికి ప్రమోట్ అవుతారు. ఇందుకు సంబంధించి ప్రత్యేకంగా ఎన్రోల్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. అమ్మఒడి పథకం గతేడాది అందిన విద్యార్థులకు ఈ ఏడాది యథాతథంగా వస్తుంది. అందుకు సంబంధించి ప్రత్యేకంగా ఎన్రోల్ చేయాల్సిన అవసరం లేదు. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యం విద్యార్థుల తల్లితండ్రులను మాయచేసి గతేడాది క్లాసులు జరగకపోయిననూ ఫీజులు వసూలు చేస్తున్నారు. ఫీజులు ఇవ్వకపోతే పైక్లాసుకు అప్గ్రేడ్ చేయమని, అందువలన అమ్మఒడి పథకం వర్తించకుండా పోతుందని చెబుతున్నారు. అధికశాతం మంది నిరక్ష్యరాస్యులైనా విద్యార్థుల తల్లితండ్రులు తమకు అమ్మఒడి పథకం అందకుండా పోతుందనే ఆందోళనతో అవస్థలు పడి మరీ కొంత ఫీజు చెల్లిస్తున్నారు. కనీసం ఒక్కో విద్యార్థి నుంచి రూ.5 వేలు మేర ఫీజులను పాఠశాల యాజమాన్యాలు వసూలు చేస్తున్నాయి. వేలాది మంది విద్యార్థుల తల్లితండ్రులు అష్టకష్టాలు పడి ఫీజులు చెల్లిస్తున్నారు. దర్శి మండలంలో 15 ప్రైవేటు ఉన్నత పాఠశాలలు, రెండు ప్రాథమికోన్నత పాఠశాలలు, 13 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. మొత్తం ప్రైవేట్ పాఠశాలల్లో సుమారు 8 వేల మంది విద్యార్థులు ఉన్నారు. గతేడాది పాఠశాలలు నిర్వహించకున్నా ఫీజులు మాత్రం వసూలు చేస్తున్నారు.
యథావిధిగా అమ్మఒడి అమలు
గతేడాది అమ్మఒడి పథకం అందిన లబ్ధిదారులందరికీ ఈ ఏడాది కూడా వర్తిస్తుంది. పాఠశాలలు మారిన వారు మాత్రమే కొత్తగా ఎన్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకే స్కూల్లో చదువుతున్న వారు ప్రత్యేకంగా ఎన్రోల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యం అమ్మఒడి పథకం పేరుతో ఫీజులు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటాం. గతేడాది పాఠశాలలు జరగనందున ఫీజులు చెల్లించనవసరం లేదు. ప్రైవేట్ పాఠశాలలు గతేడాది ఫీజులు వసూలు చేస్తున్నట్లు తెలిస్తే విచారించి చర్యలు తీసుకుంటాం.
- కె.రఘురామయ్య, ఎంఈవో, దర్శి