నేడు ’వైఎస్ఆర్ చేయూత’ ప్రారంభం
ABN , First Publish Date - 2020-08-12T10:47:32+05:30 IST
పేద మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించడానికి ఉద్ధేశించిన వైఎఎస్ఆర్ చేయూత పథకం బుధవారం జిల్లాలో ప్రారంభం
జిల్లాలో 1.33 లక్షల మంది మహిళలకు లబ్ధి
నెల్లూరు(హరనాథపురం), ఆగస్టు 11 : పేద మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించడానికి ఉద్ధేశించిన వైఎఎస్ఆర్ చేయూత పథకం బుధవారం జిల్లాలో ప్రారంభం కానుంది. జడ్పీ ప్రాంగణంలోని డీఈవోసీలో ఈ పథకాన్ని ప్రారంభి స్తారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలను ఆర్థికంగా ఆదుకోవటం ఈ పథకం ప్రధాన ఉద్ధేశం. ఈ పథకం కింద 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల లోపు వయసు ఉన్న బీసీ, ఎస్సీ మైనార్టీ మహిళలకు ఒక్కొక్కరికి సంవత్సరానికి రూ.18,750 ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందిస్తుంది. నాలుగేళ్లలో మొత్తం రూ.75వేలు వారికి అందేలా పథకాన్ని రూపొందించారు.
1,33 లక్షల మందికి లబ్ధి
జిల్లాలో ఈ పథకం ద్వారా 1,33,047 మంది మహిళలు లబ్ధిపొందనున్నారు. వచ్చే నాలుగేళ్లపాటు పథకం అమలులో ఉంటుంది. ఇందుకు అనుగుణంగా బడ్జెట్ వనరులను సమకూర్చుకుంటోంది. స్వయం సహాయక బృందాలు రూపొందించిన వస్తువులను కొనుగోలు చేయటం, వాటికి మార్కెటింగ్ సౌకర్యాన్ని కల్పించటం వంటి పనులు ఈ పథకం కింద కొనసాగనున్నాయి.
ఈడీలతో పీడీ సమావేశం
జిల్లాలోని వివిధ కార్పొరేషన్ల ఈడీలతో జేసీ(ఆసరా), డీఆర్డీఏ పీడీ శీనానాయక్ డీఆర్డీఏ సమావేశ మందిరంలో మంగళవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ పథకం కింద లబ్ధిదారులకు రూ. 246.46 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.