అప్రజాస్వామిక చర్యలతో ఎన్నికలు బహిష్కరిస్తున్నాం

ABN , First Publish Date - 2020-03-15T10:13:43+05:30 IST

అప్రజాస్వామికంగా జరుగుతున్న ఎన్నికలకు నిదర్శనంగా చైర్మన్‌ అభ్యర్థి నామినేషన్‌ను

అప్రజాస్వామిక చర్యలతో ఎన్నికలు బహిష్కరిస్తున్నాం

 ఏఎంసీ మాజీ చైర్మన్‌ విజయభాస్కర్‌రెడ్డి 


నాయుడుపేట, మార్చి 14: అప్రజాస్వామికంగా జరుగుతున్న ఎన్నికలకు నిదర్శనంగా చైర్మన్‌ అభ్యర్థి నామినేషన్‌ను తిరస్కరించడంపై నాయుడుపేట మున్సిపాలిటీ ఎన్నికలను తెలుగుదేశంపార్టీ బహిష్కరిస్తుందని ఏఎంసీ మాజీ చైర్మన్‌ విజయభాస్కర్‌రెడ్డి అన్నారు. నాయుడుపేట సితార కార్యాలయంలో శనివారం రాత్రి మాజీమంత్రి డాక్టర్‌ పరసా రత్నం, మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం, నుడా మాజీ డైరెక్టర్‌ రఘునాథరెడ్డిలతో కలసి విలేకర్లతో మాట్లాడారు. నాయుడుపేట మున్సిపాలిటీ మొదటి కౌన్సిల్‌లో టీడీపీ హయాంలో పట్టణాన్ని కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేశామన్నారు.


ప్రజలకు తమ పాలకవర్గంపై పూర్తి ఆదరణ ఉందన్నారు. కౌన్సిలర్‌ అభ్యర్థులను బెదిరించడం, భయబ్రాంతులకు గురిచేయడం, ప్రలోబాలకు గురిచేయడం వంటి చర్యలకు పాల్పడటం బాధాకరమన్నారు. నిబంధనల ప్రకారం నామినేషన్‌ దాఖలు చేసిన చైర్మన్‌ అభ్యర్థి పసల గంగాప్రసాద్‌ నామినేషన్‌ను తిరస్కరించడం అప్రజాస్వామికం అన్నారు.


మున్సిపాలిటీ లీగల్‌ అడ్వైజర్‌గా ఉన్న అతను మార్చి 9వ తేదీ రాజీనామా చేశారన్నారు. అయినప్పటికీ అతని నామినేషన్‌ తిరస్కరించడం సబబుకాదన్నారు. ఎన్నో ఎన్నికలు జరిగినప్పటికీ టీడీపీ ప్రభుత్వంలో ఇటువంటి చర్యలు జరగలేదన్నారు. అందుకోసం మున్సిపాలిటీ ఎన్నికలు బహిష్కరించి ప్రజల వద్దకు వెళ్తామని స్పష్టం చేశారు.


ఈ సమావేశంలో టీడీపీ నాయకులు ఉగ్గుమూడి భాస్కర్‌రెడ్డి, డాక్టర్‌ శ్రీపతి బాబు, అవధానం సుధీర్‌, విన్నమాల మధురెడ్డి, శేషం మునిగోపీ, ఆమవరపు సత్యం, మొండెం బాబు, కౌన్సిలర్‌ అభ్యర్థులు, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-03-15T10:13:43+05:30 IST